సినీరంగంలోని పోటీని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్తమమైన నటనను కనబరిచేందుకు ప్రయత్నించాలని.. అసూయతో రగిలిపోతే ఏమీ సాధించలేమని చెప్పింది పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్. కొన్నేళ్లక్రితం దక్షిణాదిన అగ్ర తారగా ఓ వెలుగువెలిగిన ఈ భామ ప్రస్తుతం తన మకాంను ముంబయికి మార్చింది. అక్కడ ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలన్నీ షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది రకుల్ప్రీత్సింగ్. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని పోటీతత్వం గురించి మాట్లాడుతూ ‘వృత్తిపరంగా సహచర నాయికల విషయంలో నాకు ఎలాంటి అభద్రతాభావం లేదు. ప్రతిభకు అనుగుణంగా ఇక్కడ అవశాలు దక్కుతాయి. కొందరు అద్భుతమైన ప్రతిభతో రాణిస్తుంటారు. ‘మిమి’లో కృతిసనన్, ‘గంగూబాయి కథియావాడి’ చిత్రంలో అలియాభట్ అభినయం నన్నెంతగానో ఆకట్టుకుంది. వారిని స్ఫూర్తిగా తీసుకుంటే నటిగా నా పరిధుల్ని మరింత విస్తృతం చేసుకోవచ్చనే భావన కలిగింది. ఈర్ష్యతో రగిలిపోతే సమయం వృథా చేసుకోవడం తప్ప ఏమీ సాధించలేం’ అని చెప్పింది రకుల్ప్రీత్సింగ్. ప్రస్తుతం ఆమె హిందీలో నటించిన అటాక్, రన్వే 34, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జీ, థాంక్గాడ్, ఛత్రీవాలీ..చిత్రాలు విడుదల సన్నాహాల్లో ఉన్నాయి.