‘చిన్నతనం నుంచే నాలో స్వతంత్ర భావాలు ఎక్కువ. నలుగురి కంటే భిన్నంగా బ్రతకటం, సృజనాత్మకంగా ఆలోచించడం అలవర్చుకున్నా. ఆ లక్షణాలే నన్ను సినీరంగం వైపుకు నడిపించాయి’ అని చెప్పింది యువ దర్శకురాలు లక్ష్మీసౌజన్య. ‘వరుడు కావలెను’ చిత్రం ద్వారా ఆమె దర్శకురాలిగా అరంగేట్రం చేస్తోంది. నాగశౌర్య, రీతూవర్మ జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం లక్ష్మీసౌజన్య పాత్రికేయులతో ముచ్చటించింది. ఆమె చెప్పిన సంగతులివి..
పదిహేనేళ్ల సినీ ప్రయాణం
నేను కర్నూల్లో పుట్టాను. అయితే పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసరావుపేటలో. 11ఏళ్లకే పదోతరగతి పరీక్షలు రాశా. పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ఆర్కామీడియా, ప్రకాష్ కోవెలమూడి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశా. సినీరంగంలో పదిహేనేళ్ల ప్రయాణం నాది. 2017లో నిర్మాత చినబాబుగారికి ‘వరుడు కావలెను’ కథ చెప్పాను. కరోనా వల్ల రెండేళ్లు సినిమా ఆలస్యమైంది. భూమి, ఆకాష్ అనే జంట చుట్టూ తిరిగే కథి ఇది. భూమికి ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవితాన్ని గడపాలనుకుంటుంది. ఇక ఆకాష్ పేరుకు తగ్గట్టే విశాలమైన హృదయం కలవాడు. ఆర్కిటెక్ట్గా పనిచేస్తుంటాడు. వీరిద్దరి పరిచయం, ప్రేమ, పరిణయం ఏమిటన్నదే సినిమా ఇతివృత్తం. నేటితరం యువతీయువకులకు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది.
అనుబంధాలకు ద్యశ్యరూపం
నా చుట్టూ ఉన్న సమాజం, నిజ జీవితంలో తారసపడిన వ్యక్తుల నుంచే నేను కథల్ని రాసుకుంటా. ఆత్మాభిమానం మూర్తీభవించిన ఓ అమ్మాయిని చూసి ఈ కథ తయారుచేసుకున్నా. ప్రేమ, పెళ్లి అంశాల్ని చర్చిస్తూ సున్నితమైన అనుబంధాలకు దృశ్యరూపంలా ఈ కథ ఆకట్టుకుంటుంది. నాయకానాయికల పాత్ర చిత్రణ కొత్తగా కనిపిస్తుంది. ఎలాంటి మలుపులు, ట్విస్టులు లేకుండా ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిపోతుంది. నాగశౌర్య, రీతూవర్మ జోడీ కన్నులపండువగా అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి హాయిగా ఆస్వాదించేలా ఉంటుంది. నిర్మాత చినబాబుగారి ప్రోత్సాహం వల్ల సినిమాను అనుకున్న రీతిలో తీర్చిదిద్దాను. గుర్తింపు కోసం మనుషులు పడే తాపత్రయం నేపథ్యంలో నా తదుపరి సినిమా కథ రాసుకున్నా. ప్రేక్షకుల్ని నవ్విస్తూ, సమాజానికి మంచిని పంచే సినిమాలు తీయాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నా.