సికింద్రాబాద్, డిసెంబర్ 21: ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. ప్రజా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం తగదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. జల మండలి ద్వారా నెలకు 20 వేల లీటర్ల మేర ఉచితంగా మంచినీటి సదుపాయాన్ని పొందేందుకు పౌరులు ఆధార్తో తమ వివరాలను అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 31 తుది గడువు విధించిన నేపథ్యంలో జలమండలి ఉన్నతాధికారులతో మంగళవారం డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ నేతృత్వంలో సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్మండి, బౌద్ధనగర్ మునిసిపల్ డివిజన్లలో ఆయా ప్రాంతాల జలమండలి అధికారులు ఆధార్ లింకేజ్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ క్యాన్ నంబరును ఆధార్తో సులభంగానే అనుసంధానం చేసుకోవచ్చునని, వివరాలకు సమీపంలోని జలమండలి కార్యాలయంలో, టెలిఫోన్ నంబరు 155 313 ద్వారా సంప్రదించాలన్నారు. నేటి నుంచి మెట్టుగుడ డివిజన్లో పర్యటనలు ప్రారంభించే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, కార్పొరేటర్లు సామల హేమ, సునీత, ప్రసన్న లక్ష్మి, కంది శైలజ, జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభు, జనరల్ మేనేజర్ రమణారెడ్డి, డీజీఎంలు వై. కృష్ణ, డేవిడ్ రాజ్తో టీఆర్ఎస్ నేతలు మోతె శోభన్ రెడ్డి, కంది నారాయణ, యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.