లండన్, అక్టోబర్ 29: కరోనా టీకా రెండు డోసులు వేసుకొన్నవారికి కూడా డెల్టా వేరియంట్ సోకుతుందని, వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తుందని యూకేలోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అయితే వ్యాక్సిన్ వేసుకోనివారితో పోల్చితే వైరస్ వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉంటుందని తేలింది. ఈ అధ్యయాన్ని లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ జర్నల్లో ప్రచురించారు. వ్యాక్సిన్ వేసుకొన్నవారికి వైరస్ సోకినప్పటికీ.. వ్యాధి ముదరకుండా టీకా కాపాడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 621 మందిపై అధ్యయనం చేశారు.
అంతర్జాతీయ విమానాలపై వచ్చేనెల 30 వరకు నిషేధం
అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని వచ్చేనెల 30 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఈ నిషేధం సరుకు రవాణా విమానాలకు వర్తించదని వెల్లడించింది. అయితే పరిస్థితులను బట్టి కొన్ని మార్గాల్లో ప్రయాణికుల విమానాల రాకపోకలకు అనుమతించనున్నట్టు పేర్కొంది.
‘కొవొవాక్స్’కు అనుమతివ్వండి!
డీసీజీఐకి సీరమ్ విజ్ఞప్తి
కొవొవాక్స్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని డీసీజీఐకి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. భారత్లోని 1,400 మందిపై చేసిన 2,3 దశ ప్రయోగ ఫలితాలను ఈ సందర్భంగా సమర్పించింది. ఇప్పటికే తమ సంస్థకు చెందిన కొవిషీల్డ్ టీకాకు అనుమతులు లభించాయని, ‘కొవొవాక్స్’ టీకాకు కూడా అనుమతులు లభిస్తే, వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగం పుంజుకుంటుందని వెల్లడించింది.