సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబై ఇండియన్స్కు ముకుతాడు వేసిన ఢిల్లీ.. ఆనక టాపార్డర్ విఫలమైనా.. ఆల్రౌండర్లు రాణించడంతో తొలి విజయం నమోదు చేసుకుంది. గత కొంతకాలంగా పెద్దగా చర్చలోకి రాని కుల్దీప్ యాదవ్ బంతితో మ్యాజిక్ చేస్తే.. పృథ్వీ షా, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ బ్యాట్తో దంచికొట్టారు!
ముంబై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్.. తాజా సీజన్ను పరాజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 81 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. లీగ్లో తొలి మ్యాచ్ ఆడిన తెలంగాణ ఆల్రౌండర్ ఠాకూర్ తిలక్ వర్మ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. లలిత్ యాదవ్ (48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. పృథ్వీ షా (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచి కొట్టారు. ముంబై బౌలర్లలో బాసిల్ థంపీ 3, మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టారు. ముంబై బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేసిన కుల్దీప్ యాదవ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఓపెనర్లు రోహిత్, ఇషాన్ దంచి కొట్టడంతో ముంబైకి మంచి ఆరంభం లభించింది. ధాటిగా సాగుతున్న రోహిత్ ఇన్నింగ్స్కు కుల్దీప్ యాదవ్ బ్రేక్ వేశాడు. ఆ తర్వాత అన్మోల్ప్రీత్ సింగ్ (8), పొలార్డ్ (3)ను బుట్టలో వేసుకున్న కుల్దీప్ ముంబైని కోలుకోనివ్వకుండా చేశాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా.. ఇషాన్ నిలకడగా ఆడటంతో రోహిత్ గ్యాంగ్ పోరాడే స్కోరు చేయగలిగింది. అనంతరం ఛేదనలో ఢిల్లీకి మెరుగైన ఆరంభం లభించలేదు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన సీఫెర్ట్ (21; 4 ఫోర్లు), మన్దీప్ సింగ్ (0)ను మురుగన్ అశ్విన్ ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (1), రావ్మన్ పావెల్ (0) విఫలమయ్యారు. అప్పటి వరకు పోరాడిన పృథ్వీ షా కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఒక దశలో 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోవడంతో ఢిల్లీ కోలుకోవడం కష్టమే అనిపించింది. ఈ దశలో టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 22; 4 ఫోర్లు) ధాటిగా ఆడగా.. లలిత్ యాదవ్ అతడికి అండగా నిలిచాడు. శార్దూల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ భారీ షాట్లతో విరుచుకుపడగా.. లలిత్ కూడా బ్యాట్ ఝళిపించడంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది.
ముంబై: 20 ఓవర్లలో 177/5 (ఇషాన్ 81 నాటౌట్, రోహిత్ 41; కుల్దీప్ 3/18, ఖలీల్ 2/27), ఢిల్లీ: 18.2 ఓవర్లలో 179/6 (లలిత్ 48 నాటౌట్, అక్షర్ 38 నాటౌట్; బాసిల్ 3/35).
దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ యువ ఆటగాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్ అరంగేంట్రంలో ఆకట్టుకున్నాడు. స్టార్లతో నిండి ఉన్న ముంబై జట్టులో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. 15 బంతుల్లో మూడు బౌండ్రీల సాయంతో 22 పరుగులు చేసిన తిలక్.. మైదానంలో చురుకుగా కదులుతూ కనిపించాడు. మన్దీప్ సింగ్ ఇచ్చిన క్యాచ్ను ఒడిసి పట్టిన తిలక్.. అవకాశం వస్తే బౌలింగ్ చేయడానికి కూడా సిద్ధమని అంటున్నాడు.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఢిల్లీతో పోరులో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ‘నిర్ణీత సమయంలో ముంబై జట్టు ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్లో ఇది తొలి తప్పిదం. ఐపీఎల్ నియమావళి ప్రకారం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మపై రూ. 12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.