ఢిల్లీ, జూన్ 1: భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ సహకారంపై, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీటర్ డటన్తో టెలిఫోన్ ద్వారా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. గతేడాది జూన్లో “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం” తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ సహకారం మరింత పెరిగినట్లు మంత్రులిద్దరూ అంగీకరించారు. మలబార్ విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొనడం ఈ భాగస్వామ్య వృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది.
రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ ఒప్పందాల పట్ల మంత్రులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ఒప్పందాలను మరింత పెంచేందుకు తమ నిబద్ధతను వ్యక్తపరిచారు. కొవిడ్పై పోరాటంలో భారత్కు అండగా నిలిచినందుకు ఆస్ట్రేలియాకు రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.