హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం కొత్తగా 1,825 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 3.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. మరోవైపు 351 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలకు చేరుకొన్నది. రికవరీ రేటు కాస్త తగ్గి 97.26 శాతంగా నమోదైంది.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,042, మేడ్చల్ మల్కాజిగిరి 201, రంగారెడ్డి 147, సంగారెడ్డి 51, హనుమకొండలో 47 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క కేసు కూడా నమోదుకాని ములుగు జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం కేసులు నమోదయ్యాయి. అటు.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2.74 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.13 లక్షల మందికి మొదటిడోస్, 1.39 లక్షల మందికి రెండో డోస్, 22,045 మందికి బూస్టర్ డోస్ వేశారు. 15-18 ఏండ్లు మధ్య వయసు వారికి ఇప్పటి వరకు 7.52 లక్షల మదికి టీకాలు వేశారు.
మొత్తం లక్ష్యంలో ఇది 41 శాతం. ప్రస్తుతం రాష్ట్రంలో 19.89 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. 54,590 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కరోనా బారినపడ్డారు. గొంతునొప్పి, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న ఆయన సోమవారం కరోనా పరీక్ష చేసుకోగా, పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు కూడా వైరస్ సోకింది. దీంతో సోమవారం నిర్వహించాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సబ్ కమిటీ సమావేశం వాయిదా పడింది.