పిలిభిత్, అక్టోబర్ 4: రైతుల ఆందోళనను అణచివేసేందుకు యోగి సర్కారు కుట్రచేస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ మండిపడ్డారు. ట్రాక్టర్ ట్రాలీ ప్రయాణాలను యూపీ సర్కారు నిషేధించడాన్ని ఆయన ఖండించారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు.
రైతులంతా ఎక్కువగా ట్రాక్టర్లలోనే ప్రయాణిస్తారని, ఇది తెలిసే ఉద్యమంలో అన్నదాతలు పాల్గొనకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ విషయంపై యోగి సర్కారుకు లేఖ రాయనున్నట్టు టికాయిత్ తెలిపారు. ఈ నెల ఒకటో తేదీన కాన్పూర్లోని కొలనులో ఓ ట్రాక్టర్ ట్రాలీపడగా, 26 మంది మృతిచెందారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రాక్టర్ ట్రాలీల్లో ప్రయాణాన్ని నిషేధించారు.