Danam Nagender : బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్లోకి ఫిరాయించి అనర్హత వేటుకు గురైన దానం నాగేందర్ (Danam Nagender) యూటర్న్ తీసుకున్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా, ఉప ఎన్నికకు సిద్ధమేనని ప్రకటించిన దానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత ధర్మాసనంలో శనివారం ఆయన పిటిషన్ వేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరోజులోనే మాట మార్చారు. అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన లేదని, ఉప ఎన్నికకు సిద్ధమేనని పేర్కొన్న ఆయన శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటును ఆయన సవాల్ చేశారు. ఖైరతాబాద్ నుంచితన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు దానం. కాగా, ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు నిర్ధారించింది. ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, అదే పార్టీలో కొనసాగుతూనే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం ద్వారా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని 2(1)(ఏ)తోపాటు ఆర్టికల్ 191(2) ప్రకారం ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ప్రకటించింది.