రాయ్బరేలీ: ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఓ దళితుడిపై దాడి చేసి అతని చేత కాళ్లు నాకించారు. ఈ ఘటనకు సంబంధించిన 2.30 నిమిషాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేలపై కూర్చుని చేతులతో చెవ్వులు పట్టుకుని మోటార్సైకిల్పై ఉన్న వ్యక్తి పాదాలను ఆ దళిత వ్యక్తి నాకాడు. భయంతో వణుకుతున్న ఆ దళిత విద్యార్థిని చూస్తూ అక్కడ ఉన్న ఇతరులు నవ్వ సాగారు. నిందితుల్లో ఓ వ్యక్తి థాకూర్ అని పిలువాలంటూ ఆ దళితుడితో చెప్పాడు. ఇలాంటి తప్పు మరోసారి చేస్తావా అంటూ ఆ దళితుడిని బెదిరించారు.
అయితే ఆ బాధిత దళిత వ్యక్తి మారిజునా అమ్ముతున్నట్లు మరో వీడియోలో ఆరోపించారు. ఆ ఆరోపణలను భయంతో ఆ దళితుడు అంగీకరిస్తున్నట్లు వీడియోలో ఉంది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏడు మందిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ ఘటన జరిగింది. బాధితుడు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు తర్వాత అరెస్టులు జరిగాయి. యూపీ పోలీసులు నిందితులపై కేసు బుక్ చేశారు.
దళిత బాధితుడు పదో తరగతి విద్యార్థి. తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే నిందితుల్లోని ఒకరి పొలాల్లో ఆ బాధితుడి తల్లి పనిచేస్తోందని స్థానికుల ద్వారా తెలిసింది. తల్లి పనికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని ఆ విద్యార్థి డిమాండ్ చేయడంతో అతనిపై అటాక్ జరిగింది. ఆ సమయంలో దళితుడిని పట్టుకుని కాళ్లు నాకించినట్లు అనుమానిస్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్లో ఈ ఆరోపణలు లేనట్లు తెలుస్తోంది.