‘మాహి గౌతమి’గా సుపరిచితురాలైన గౌతమికి సీరియల్స్లో తాను ధరిస్తున్న పాత్రల పేర్లంటే ఎంతో ఇష్టమట. ‘ఆ వ్యక్తిత్వ చిత్రణ కల్పన కావొచ్చు. కానీ, నా జీవితం వాస్తవం కదా’ అంటున్నదీ..
జీ తెలుగు ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’.
నేను హైదరాబాద్ గుడిమల్కాపూర్ ప్రాంతంలో పుట్టిపెరిగాను. పాఠశాల రోజుల్లో ఆటపాటల్లో ముందుండేదాన్ని. జిల్లా స్థాయి వరకు పోటీపడ్డాను. పాటల పోటీల్లో అనేక బహుమతులు సాధించాను. ఎన్సీసీలో శిక్షణ పొందాను. బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. కానీ, నాకంటూ గుర్తింపునిచ్చే పని చేయాలన్నదే నా కోరిక. అందుకే, ఉద్యోగాన్ని కాదనుకుని టీవీలో యాంకరింగ్ చేస్తానని పేరెంట్స్తో చెప్పాను. అమ్మ (వరలక్ష్మి), నాన్న (రవీందర్ సాగర్) ముందు అంగీకరించలేదు. మెల్లగా ఒప్పించి యాంకర్గా అడుగుపెట్టాను. రేడియో జాకీగానూ చేశాను. అప్పుడే, గౌతమిని కాస్తా మాహి గౌతమి అయిపోయాను. అంతలోనే సినిమా అవకాశమూ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. కొవిడ్ దెబ్బకు మొత్తం ఆగిపోయింది. అయినా నాకు బాధ లేదు. ఎందుకంటే, టీవీ సీరియల్స్ నాకెంతో గుర్తింపునిచ్చాయి. ఎక్కడికెళ్లినా నన్ను గుర్తుపట్టేస్తారు. అమ్మానాన్న కూడా సంతోషంగా ఉన్నారు.
‘గౌతమి పేరెంట్స్’ అని గర్వంగా చెప్పుకొంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి. సీరియల్స్.. సీరియల్స్.. సీరియల్స్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటాను. సమయం లేక నాకు
ఇష్టమైన ఆర్జే కొలువునూ వదిలేశాను. టీవీ యాంకరింగ్ కూడా పక్కన
పెట్టేయాల్సి వచ్చింది. గడగడా మాట్లాడాలంటే.. రోజూ పుస్తకాలు చదవాలి, పేపర్లు తిరగేయాలి మరి.
జీ తెలుగు ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’లో భాగ్యలక్ష్మిగా, మరో ఛానెల్లో ప్రసారం అవుతున్న ‘రంగులరాట్నం’ సీరియల్లో సీతామహాలక్ష్మిగా నటిస్తున్నాను. ఈ రెండు పాత్రల్లోనూ పల్లెటూరి పిల్లనే. హైదరాబాద్లో పెరిగినా, నాకు పల్లెటూళ్లంటే ఇష్టం. ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’లో భాగ్యలక్ష్మి అమ్మానాన్నలను, తాతయ్యను పోగొట్టుకుని.. తమ్ముడిని, చెల్లిని వెంటబెట్టుకుని పట్నానికి వస్తుంది. అనూహ్యంగా సంపన్నుల ఇంటి కోడలవుతుంది. కష్టాల్లో ఉన్న భర్తకు అండగా నిలుస్తుంది. ఈ పాత్రలోని ధైర్యం, అమాయకత్వం.. నా జీవితంలోనూ ఉన్నాయి.