హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత సైబర్ యుగంలో అందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు, అగ్గువకే ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి రావడంతో నేర విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. కంటికి కనిపించకుండానే కోట్లు కొల్లగొట్టే సైబర్ నేరగాళ్లు మొదలుకొని పిచ్చి కామెంట్లతో ట్రోలింగ్లు, మార్ఫింగ్లతో ఇతరులను వేధించే చిల్లరగాళ్ల దాకా అందరికీ ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికలు అడ్డాగా మారుతున్నాయి. ఇలాంటి నేరగాళ్ల భరతం పట్టేందుకు తెలంగాణ పోలీసులు సైబర్ గస్తీని ముమ్మరం చేస్తున్నారు. ఆన్లైన్ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికలు, బ్లాగ్లలో మాటువేసి మహిళలు, యువతులను వేధించే వారిపై నిఘా పెడుతున్నారు.
ఆన్లైన్ను ఆధారంగా చేసుకొని మహిళలు, విద్యార్థినులను వేధించేవారిని కట్టడి చేసేందుకు, సైబర్ ఈవ్టీజర్ల పని పట్టేందుకు రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్సైలు, ఏడుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా విటుల రూపంలో ఆన్లైన్ అకౌంట్లలో కస్టమర్లుగా కొనసాగుతూ అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. డేటింగ్ సైట్లలో చేరుతున్న వారిని గమనిస్తున్నారు.
ఇందుకోసం 3 ప్రత్యేక విధానాలను (వెబింట్, ఓసింట్, డీపింట్) అనుసరిస్తున్నారు. వెబింట్లో భాగంగా వెబ్ నుంచి సేకరించిన డాటాను విశ్లేషించి దాని ఆధారంగా నేరాల నియంత్రణపై దృష్టి పెడుతున్నారు. ఓసింట్ (ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్) ఆన్లైన్లో ఉచితంగా, పబ్లిక్గా అందుబాటులో ఉన్న సైబర్ టూల్స్ను ఉపయోగించుకొని నేర విధానాలు, నేరస్థుల కదలికలను గమనిస్తున్నారు.
డీపింట్ లేదా డార్క్ఇంట్లో భాగంగా డార్క్నెట్ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగే వెబ్సైట్లు, ఇతర మాధ్యమాల్లో కస్టమర్లుగా చేరి, అందులోని సభ్యుల కదలికపై నిరంతరం నిఘా పెడుతున్నారు. అదేవిధంగా మహిళలను వేధిస్తూ తరచుగా షీటీమ్స్కు పట్టుబడుతున్న నేరస్థుల డాటాను సేకరిస్తున్నారు. వారిని ఏ, బీ, సీ క్యాటగిలుగా విభజించి పెద్ద నేరస్థులు, వారితో టచ్లో ఉంటున్నవారి సోషల్ మీడియా ఖాతాలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.