ఘట్కేసర్ రూరల్, నవంబర్ 19: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండ లం ఎదులాబాద్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. శుక్రవారం అంకుషాపూర్కు చెందిన సామల శ్రీనివాస్, రమ్యకృష్ట వివాహానికి హాజరైన మిత్రులు సైకిల్ తీసుకొచ్చారు. ‘సీను నువ్వు పెండ్లి చేసుకుంటున్నావని తెలిసి బైక్ కొనిద్దామనుకున్నాం. కానీ, పెండ్లి తర్వాత నీకు ఖర్చులు ఎక్కువైతయి.. బండ్లె పెట్రోలు పోసుడు నీకు తక్లీబ్ అయితది.. అందుకే బైక్ కొనటం ఆపినం.. మేము నీకు బండి కొనిచ్చి తలుగు ఇప్పిస్తే.. పెట్రోలు పోసుడు నీకు బర్రెను కొన్నంత పనైతది.. గందుకే నీ మంచి కోరే చెడ్డీ దోస్తులం సైకిలు పెడుతున్నం ఏమనుకోకు’ అని వివరించారు. రోజురోజుకూ పెట్రోల్ ధర పెరిగిపోతుండటంతో తమ మిత్రుడికి బైక్ భారమని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ తతంగం చూసిన బంధుమిత్రులు ముక్కున వేలేసుకున్నారు.