హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని, ఇందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్పై ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ౩కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్వంటి పాశ్చాత్య దేశాలు, చైనాల్లో మహమ్మారి తిరగబెట్టిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వ్యాక్సినేషన్ను మరింత ఉధృతం చేసేందుకు గ్రామ, వార్డు స్థాయి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక బృందంలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏను సభ్యులుగా చేయాలని సూచించారు. ప్రతీ గ్రామానికి ఒక నోడల్ అధికారిని, మండలానికో ప్రత్యేక అధికారిని నియమించి నిత్యం వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. టీకాలు, సిరంజీలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు రెండు డోసుల టీకా తీసుకోవడమే ఏకైక మార్గమనే విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి.. వ్యాక్సినేషన్ను సమర్థవంతంగా చేపట్టాలన్నారు.
వీసీలో పీఆర్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి , వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పీఆర్ కమిషనర్ శరత్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్ రావు, వైద్య విద్యాశాఖ సంచాలకులు రమేశ్రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.