హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): నిరంతర విద్యుత్తు సరఫరా, మెరుగైన సేవల్లో పలు జాతీయస్థాయి అవార్డులు కైవసం చేసుకొన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)ను కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రశంసించింది. టీఎస్ ఎస్పీడీసీఎల్లోని సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (సీపీటీఐ) విభాగం అందిస్తున్న అద్భుత సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రశంసాపత్రాన్ని అందజేసింది. సబ్స్టేషన్ల నిర్వహణ, లైన్ల మరమ్మతులతోపాటు వినియోగదారులతో విద్యుత్తు సిబ్బంది ఎలా మెలగాలన్న అంశాలపై ఆర్ఈసీ ప్రతిపాదించిన జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు రూ.1.02 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేసింది. దీనిపై టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది తమ సిబ్బంది కృషి ఫలితంగానే ఈ గౌరవం లభించిదని పేర్కొంటూ సీపీటీఐ, మానవ వనరుల అభివృద్ధి విభాగ అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.