న్యూఢిల్లీ, జనవరి 19: ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా పరీక్షల వ్యూహాన్ని (కరోనా టెస్టింగ్ స్ట్రాటజీ) ఐసీఎంఆర్ మార్చింది. ఈ మేరకు ఈనెల 10న కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. 2020 సెప్టెంబర్ 4న జారీచేసిన టెస్టింగ్ స్ట్రాటజీతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉన్నది.
టెస్టింగ్ ప్రొటోకాల్లో మార్పులు ఎందుకు?
గతంలో ప్రబలిన కరోనా వేరియంట్లతో (డెల్టా, డెల్టా ప్లస్) పోలిస్తే, ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నది. దేశంలో ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో ఇది వ్యాపించింది. దీంతో హై-రిస్క్ క్యాటగిరీలో ఉన్నవారిని త్వరగా గుర్తించడం ఇప్పుడు అతి ముఖ్యం. ప్రమాదంలేని వారికి కూడా టెస్టులు చేస్తే, ముప్పు క్యాటగిరీలో ఉన్నవారిని గుర్తించడంలో జాప్యం జరుగుతుంది. అందుకే టెస్టింగ్ ప్రొటోకాల్ను మార్చారు.
దేశంలో ఇప్పటికే, 89.5 శాతం మందికి ఒక డోసు, 64.5 శాతం మందికి రెండు డోసులు ఇచ్చారు. దీంతో అత్యధిక జనాభాలో యాంటిబాడీలు ఉత్పత్తి అయ్యాయి. దేశ జనాభాలో 67 శాతం మందిలో యాంటిబాడీలు ఉన్నట్టు సెరో-సర్వేలో తేలింది. కొత్త వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండటంతో దవాఖానలో చేరికలు కూడా తగ్గాయి. టీకా వేసుకొన్న వారిలో ఒమిక్రాన్ కారణంగా లక్షణాలు కనిపించడం లేదు. లేదా స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. దీంతో హై-రిస్క్ క్యాటగిరీ కేసులనే గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే వైరస్ నిర్ధారణ పరీక్షలు అందరికీ చేయాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ భావిస్తున్నది.
ప్రతికూల ప్రభావం ఉంటుందా?
తాజా నిబంధనలతో పరిమితంగా పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య తగ్గే అవకాశమున్నదని, వైరస్ సోకినవారిని కూడా గుర్తించలేమన్న వాదనలు ఉన్నాయి. ఇది ఒకవిధంగా నిజమే. సెరో-సర్వే ప్రకారం.. దేశంలో ఇప్పటికే 67 శాతం మందికి (దాదాపు 90 కోట్లు) వైరస్ సోకినట్టు తేలింది. గతంలో అందరికీ పరీక్షలు నిర్వహించినప్పటికీ.. దేశంలో ఇప్పటివరకూ 3.79 కోట్లమందికే వైరస్ సోకినట్టు కేసుల ద్వారా నిర్ధారణ అయింది. అంటే, 86 కోట్ల మందికి వైరస్ సోకినా గుర్తించలేదు. ఇప్పుడు పరిమితంగా టెస్టులు చేస్తే వైరస్ సోకిన ఎంతో మందిని గుర్తించలేకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.