అది పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలోని ప్రభుత్వ పాఠశాల. పిల్లలంతా ప్రతిజ్ఞ పూర్తిచేశారు. ఇక తరగతి గదుల్లోకి వెళ్దామనుకునే లోపే ప్రధానోపాధ్యాయురాలు.. స్టాండటీజ్ అంటూ పిల్లలందరినీ అప్రమత్తం చేశారు.. ‘పిల్లలూ..అందరూ మాస్కులు పెట్టుకోవాల్సిందే. చేతులతోపదే పదే మాస్కులను ముట్టుకోవద్దు. ఎవరూబయట దుకాణాల్లో, రోడ్ల మీద మిక్చర్, బిస్కెట్లు, పాపిడి మిఠాయి ఇంకా ఏ వస్తువు కూడా కొనుక్కోవద్దు. ఎవరైనా కొంటే ఊరుకునేది లేదు’ అంటూ సున్నితంగా హెచ్చరించారు. ఒమిక్రాన్ భయం.. ఇతర దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తినేపథ్యంలో విద్యార్థులను జాగృతపరుస్తున్నారు. ఇది ఒక్క తట్టిఅన్నారంలోని సర్కారు పాఠశాలకేపరిమితం కాలేదు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తున్నారు. కొవిడ్-19 తీవ్రతను తెలియజేస్తున్నారు. వైరస్ను ఎలా ఎదుర్కోవాలో, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.
పాఠశాలలో విద్యార్థులకు కరోనాపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు రోజూ ఉష్ణోగ్రతలు చెక్ చేస్తున్నాం. ఏమాత్రం జ్వరం, ఇతర కరోనా లక్షణాలు ఉన్నా వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాం. వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నాం. – సూర్యకళ, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, తట్టిఅన్నారం
విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లకముందే వారి టెంపరేచర్ను తనిఖీ చేస్తున్నాం. హైపో క్లోరైడ్ ద్రావణంతో తరగతి గదులను శుభ్రపరుస్తున్నాం. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా బయట వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దని పదే పదే చెప్తున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. భౌతికదూరం పాటించేలా ప్రయత్నిస్తున్నాం. – జయత్రాం, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కుత్బుల్లాపూర్
అవగాహన.. ప్రత్యేక పర్యవేక్షణ