వనపర్తి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసి బ్యాంకులను ప్రైవేటుపరం చేశారు. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలను పెట్రోల్, డీజిల్, గ్యాస్ల మీద భారం వేసి సామాన్య ప్రజల నుంచి కేంద్రం దోచుకుంటుందని వ్యవవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
వనపర్తి పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్పొరేట్ల కోసం ఏడేండ్లలో రూ.8 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. 5 ఏండ్లలో రూ.4,64,600 కోట్లు కార్పొరేట్లకు పన్ను రాయితీ ఇచ్చిందని విమర్శించారు.
బీజేపీ పాలనలో కార్పొరేట్లు వెలిగిపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేశారని మండిపడ్డారు.
ప్రైవేటు రంగం ప్రోత్సహించడం మూలంగా పదిమంది పని ఐదుమందితోనే చేయిస్తారన్నారు. రిజర్వేషన్లను తెలివిగా ఎత్తేసి బడుగు, బలహీనవర్గాల యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఏం జరుగుతుందో విజ్ఞులైన పట్టభద్రులు, ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్ లో నిర్ణయం తీసుకోవడానికి ఏమీ ఉండదన్నారు.
1999లో ఆలోచన చేసి 2001లో ఏకంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడానికి ఒక శాఖ పెట్టిన ఘనత ఈ దేశంలో బీజేపీ పార్టీదని గుర్తు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను హోల్ సేల్గా అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని మొదటి ప్రాధాన్య ఓటేసి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు.