ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నారో, దానివల్ల ఏయే రంగాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, వినియోగదారులకు ఏం లాభం కలుగుతుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. కనీసం ఒక అధ్యయన నివేదికను కూడా విడుదల చేయడం లేదు.
ఈ బిల్లుతో రాష్ట్ర డిస్కంలు బలహీనం అవుతాయి. ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులు వంటి సబ్సిడీ వినియోగదారులపై భారం పడుతుంది.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్తు బిల్లు కొంపముంచుతుందని మేధావులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టంచేశారు. ఈ బిల్లుతో రాష్ర్టాల అధికారాలను కేంద్రం గుంజుకొంటున్నదని మండిపడ్డారు. ఇది రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థపై పిడుగుపాటుగా మారుతుందని, కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండిస్తుందని చెప్పారు. కాబట్టి ఈ బిల్లును యథాతథంగా అమలు చేయొద్దని ‘ద పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ సర్వీసెస్’ అనే సంస్థ కేంద్రాన్ని కోరింది. ఇందులో విద్యావేత్తలు, న్యాయవాదులు, మాజీ అధికారులు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారు. విద్యుత్తుశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ, కేరళ మాజీ ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్, ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ఎస్పీ శుక్లా, జేఎన్యూ రిటైర్డ్ ప్రొఫెసర్ సీపీ చంద్రశేఖర్, న్యాయవాది ఇందిరా జైసింగ్ వంటివారు ఈ బృందంలో సభ్యులు. ఈ బిల్లుతో జరిగే నష్టాల జాబితాను కేంద్రానికి పంపించారు.
బిల్లులో విద్యుత్తు పంపిణీకి ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్కు బదులుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఒక సంస్థ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) పరిశీలించి, అన్ని ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులు ఇస్తుంది. కొత్త బిల్లు అమలులోకి వస్తే కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత.. దరఖాస్తు చేసుకొన్న 60-75 రోజుల్లోగా ఈఆర్సీ అన్ని రకాల అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. లేదంటే గడువు దాటిన తర్వాత ఆటోమెటిక్గా అనుమతులు వచ్చినట్టు పరిగణిస్తారు. దీంతో అవినీతి విచ్చలవిడిగా పెరుగడంతోపాటు ప్రమాణాలు లేకున్నా కంపెనీలు పనులు ప్రారంభించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అవకాశాలు ఉన్నాయి.