హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి గాంధీభవన్కు చేరాయి. పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీకి అనుకూలంగా కామారెడ్డి నేతలు గాంధీభవన్ వద్ద పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అక్కడ హంగామా నెలకొన్నది. షబ్బీర్ అలీకి మద్దతుగా వెలసిన ఈ ఫ్లెక్సీలు, పోస్టర్లు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫ్లెక్సీల్లో ‘నిజం ఎప్పటికీ మరుగున పడదు’, ‘నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరు’, ‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన చాంపియన్ షబ్బీర్ అలీ’ అంటూ ముద్రించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ వర్గానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన చంద్రశేఖర్రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యల వీడియోలు బయటకు రావడం, ఆ తర్వాత ఆయనకు మద్దతుగా ఈ ఫ్లెక్సీలు వెలువడం కలకలం రేపింది. కామారెడ్డి నియోజకవర్గ నేతలు గాంధీభవన్ వేదికగా బలనిరూపణకు దిగడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.