సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి ఫుట్పాత్పై నిద్రిస్తున్న బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన పాత నేరస్తుడిని పోలీసులకు పట్టించడంలో చొరవ చూపిన ఆటో డ్రైవర్ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అభినందించారు. న్యూహఫీజ్పేట్కు చెందిన మహ్మద్ రిజ్వాన్ బేగం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నాంపల్లి యూసుఫియాన్ దర్గా ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటుంది.
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి వరకు భిక్షాటన చేసి జీపీవో సమీపంలో ఉండే తన సోదరుడు మహ్మద్ బిన్ యామని దగ్గరకు వెళ్లింది. తాను నివాసముండే హఫీజ్పేట్కు వెళ్లేందుకు రైలు లేకపోవడంతో జీపీవో దగ్గరే బాటా షోరూం సమీపంలో ఫుట్పాత్పై పడుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో ఒక వ్యక్తి పుట్పాత్పై నిద్రిస్తున్న బాలికపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో, అక్కడే ఆటోను పార్కు చేసిన డ్రైవర్ సయ్యద్ జహీద్ గమనించాడు. వెంటనే బాలిక తల్లిని, మామను నిద్ర లేపి అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పట్టుకున్నారు.
అదే సమయంలో అబిడ్స్ పోలీస్స్టేషన్ పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకొని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను అఫ్జల్గంజ్కు చెందిన మహ్మద్ చోటు అనే పాత నేరస్తుడని తేలింది. నిందితుడిపై 16 కేసులుండగా ఈ ఏడాది జూలైలో జైలుకు వెళ్లి వచ్చినట్లు తేలింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా ఓ పాత నేరస్తుడి చేష్టలను గుర్తించి బాధ్యతగా స్పందించిన ఆటో డ్రైవర్ సయ్యద్ జాహెద్ను సీపీ అంజనీకుమార్, సెంట్రల్ జోన్ జాయింట్ సీపీలు మెమెంటో ఇచ్చి అభినందనలు తెలిపారు. అబిడ్స్ పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందిని కూడా సీపీ అభినందించారు.