అంబర్పేట, డిసెంబర్ 29: ఇరవయ్యేండ్ల కల సాకా రం కాబోతున్నది. అనాదిగా చోటు చేసుకుంటున్న స మస్యకు ఇక తెర పడనుంది. వర్షాకాలం వచ్చిందంటే బిక్కు బిక్కుమంటూ నిత్యం గజగజ వణికే లోతట్టు ప్ర జానికానికే ఇక చింత తీరినట్టు అవుతున్నది. హుస్సేన్సాగర్కు ఇరువైపులా పాత వైస్రాయ్ హోటల్ నుంచి అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ ర త్నానగర్, గోల్నాక బ్రిడ్జి వరకు నాలా ప్రహరి రక్షణ గో డ (సేప్టీవాల్) నిర్మాణానికి రూ.65 కోట్ల నిధులు మం జూరయ్యాయి. నాలాను ఆనుకొని ఉన్న బస్తీలకు వరద ముంపు నుంచి రక్షణగా ప్రహరీని నిర్మించేందుకు ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ పనులకు ఈ నెల 30వ తేదీ గురువారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మం త్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్లు శంకుస్థాపన చేస్తున్నారు.
ఎప్పుడు భయాందోళనే…
హుస్సేన్సాగర్ నాలా నీరు లోయర్ ట్యాంక్బండ్ నుంచి ప్రారంభమై అశోక్నగర్, హిమాయత్నగర్, నారాయణగూడ, బాగ్లింగంపల్లి, బర్కత్పుర, రత్నానగర్, వెంకటేశ్వరనగర్ల నుంచి వచ్చి గోల్నాక వద్ద మూసీనదిలో కలుస్తుంది. భారీ వానలు కురిసినప్పుడు హుస్సేన్సాగర్ నిండినప్పుడు దిగువకు నీటిని వదులుతారు. నాలా నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు బస్తీలను వరద ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీన్ని నివారించడానికి హుస్సేన్సాగర్ నాలాకు నియోజకవర్గంలో నిర్ణీత ప్రాంతంలో ప్రహరీ నిర్మించాలని ప్రతిపాదించారు.
నల్లకుంట రత్నానగర్ వద్ద శిలాఫలకం
కొన్నేండ్లుగా ఈ నాలాకు ప్రహరి గోడ కట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు రత్నానగర్లోని అన్ని ఇండ్లు వరద ముంపునకు గురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి బస్తీని సందర్శించారు. ఆ సందర్భంగా స్థానిక బస్తీవాసులు తమకు వరద ముంపు బాధ తప్పాలంటే హుస్సేన్సాగర్ నాలాకు రత్నానగర్ వద్ద రక్షణగా ప్రహరి గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. తప్పకుండా రక్షణ గోడ నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇటీవల ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రహరి నిర్మాణం విషయమై మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ల దృష్టికి తీసుకెళ్లారు. వారితో సమావేశమయ్యారు. వెంటనే రత్నానగర్ నాలా నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు చేశారు. అలాగే, హుస్సేన్సాగర్ నాలాకు ఇరువైపుల పాత వైస్రాయ్ నుంచి ఎక్కడెక్కడ ప్రహరి గోడ లేదో అక్కడ నిర్మాణం చేపట్టేందుకు మరో రూ.30 కోట్లను మంజూరు చేశారు. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను ప్రభుత్వానికి అందించారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (ఎస్ఎన్డీపీ) లేక్స్ విభాగం వారు ఈ ప్రహరి గోడ పనులను చేపట్టనున్నారు.
కేటీఆర్ చొరవతో నిధులు
మంజూరు-కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే
రత్నానగర్ బస్తీని ఆనుకొని హుస్సేన్సాగర్ నాలా ప్రవహిస్తున్నది. ప్రతి ఏడాది వర్షాకాలంలో బస్తీవాసులు నిత్యం భయాందోళనతో ఉండాల్సి వస్తున్నది. గతేడాది వర్షాలకు బస్తీ ముంపునకు గురైంది. అప్పుడు మంత్రి కేటీఆర్ బస్తీవాసులను పరామర్శించారు. ఇక్కడ నాలాకు ప్రహరి గోడ నిర్మించాలని బస్తీవాసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి చొరవతో రూ.35 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గురువారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన జరుగుతున్నది. కొన్నేండ్ల బస్తీ ప్రజల కల నెరవేరబోతున్నది.
20 యేండ్లుగా సమస్య…
గతంలో పలుమార్లు భారీ వర్షాలకు బర్కత్పుర రత్నానగర్ బస్తీ ముంపునకు గురైంది. సమస్య పరిష్కారానికి రక్షణ గోడ నిర్మించాలని 20 యేండ్ల క్రితం ప్రతిపాదించారు. ఎట్టకేలకు ప్రహరి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సేఫ్టీవాల్ నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేపట్టారు. రెవెన్యూ విభాగం వారితో కలిసి కొలతలు తీసుకున్నారు.