హైదరాబాద్, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): ఐటీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్లో ఐదు అంతస్తులతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఐటీ హబ్ను పరిశీలించాలని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖల కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అమెరికాలోని ఐటీ సర్వ్ అలయన్స్ ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. స్థానిక ఎమ్మెల్యే గణేష్ బిగాల ఐటీ హబ్ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారని, ఐటీ కంపెనీల ప్రతినిధులు సందర్శించి ఏమైనా సూచనలు చేస్తే వారి అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా స్థానిక ఐటీ సర్వ్ అలయన్స్ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో ఐటీ కంపెనీల స్థాపనకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల ప్రకారం మహేశ్ బిగాల శనివారం అమెరికాలో స్థానిక ఐటీ సర్వ్ అలయన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.