వనస్థలిపురం, జనవరి 4 : మొదటి భర్తతో విడాకులు తీసుకున్నది. రెండో భర్త కరోనాతో చనిపోయాడు. ఆ తర్వాత మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నది. ఆ ప్రియుడి స్నేహితుడితో కూడా సంబంధం పెట్టుకున్నది. ఇదంతా నిలదీసిన రెండో భర్త స్నేహితుడిని రోకలిబండతో కొట్టి చంపించింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంచలనమైన ఘటన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బొమ్మకల్కు చెందిన కొమ్ము ప్రియాంక అలియాస్ దీప్తి (27)కి గతంలోనే వివాహం జరిగింది. అయితే ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఉదయ్కుమార్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నది. గత ఏడాది ఉదయ్కుమార్ కరోనాతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రియాంక మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా నివాసముంటున్నది. ఈ క్రమంలో నగరంలోని ఫిలింనగర్కు చెందిన సాయికుమార్ అలియాస్ రాజు కుమార్ (22)తో షేర్చాట్ యాప్ద్వారా పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. దీంతో గత అక్టోబర్ నెలలో వనస్థలిపురంలోని కమలానగర్ కాలనీకి మకాం మార్చింది. అయితే ఆమె సాయి కుమార్తోపాటు మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది.
రోకలి బండతో చావబాది
ఈ నేపథ్యంలో.. ప్రియాంక రెండో భర్త స్నేహితుడైన గుడిపాటి శ్రీనివాస్ (32) ఆమె భర్త బతికి ఉన్నప్పటినుంచి వారి యోగ క్షేమాలు చూసేవాడు. సూర్యాపేటలో ఉండే ఆయన గత డిసెంబర్ 10వ తేదీన తన స్నేహితుడితో కలిసి కమలానగర్ కాలనీలోని ఆమె ఇంటికి వచ్చాడు. అతడు వచ్చేసరికి సాయికుమార్ కూడా అక్కడే ఉన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నావంటూ.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సాయికుమార్ను కూడా దూషించాడు. దీంతో గొడవ పెద్దదైంది. సాయంత్రం వరకు తగ్గకపోవడంతో శ్రీనివాస్ వెంట వచ్చిన స్నేహితుడు ఇంటికి వెళ్లిపోయాడు. గొడవ తారస్థాయికి చేరడంతో సాయి కుమార్ రోకలిబండతో శ్రీనివాస్ తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని ప్రియాంక తన రెండో ప్రియుడికి ఫోన్లో చేరవేసింది. అతడి సలహా మేరకు మృతదేహాన్ని కాళ్లు, చేతులు కట్టేసి, దుప్పట్లో మూటగట్టి బజాజ్ అవేంజర్ బైక్(టిఎస్05ఈఎం1007)పై తీసుకువెళ్లి విజయపురి కాలనీ బస్టాప్ సమీపంలో పడేశారు. సాయికుమార్ బైక్ను నడపగా ప్రియాంక మృతదేహాన్ని పట్టుకుని వెనుక కూర్చుంది. కాగా మూడు రోజుల తర్వాత తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పట్టించిన ఏటీఎం కార్డు..!
రాత్రి సమయంలో మృతదేహాన్ని పడేయడం, సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలేవీ రికార్డు కాకపోవడంతో పోలీసులకు ఈ కేసును ఛేదించడం తలనొప్పిగా మారింది. దీంతో ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు నిర్వహించారు. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన నిందితులు మృతుడి జేబులో ఉన్న ఏటీఎం కార్డును మాత్రం అలాగే వదిలేశారు. ఆ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకొని పోలీసులు కూపీ లాగారు. సాయికుమార్, ప్రియాంకను మంగళవారం రిమాండ్కు తరలించారు. వారికి సహకరించినట్లుగా అనుమానం ఉన్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.