హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాజధాని నగరం హైదరాబాద్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన ఈ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పోలీసు బ్యాండ్తో స్వాగతించారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఆ తరువాత సీఎం కేసీఆర్ సరిగ్గా ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కోటి రూపాయల చెక్కును బహుకరించారు. అలాగే జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఇషాసింగ్ను, టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ను సీఎం కేసీఆర్ సత్కరించి, ఇద్దరికీ చెరొక రూ.2 కోట్ల చెక్కును బహుకరించారు.