కేసీఆర్ ప్రెస్మీట్: బండి సంజయ్ నువ్వో తోకగాడివి..నా ఫాంహౌజ్ దున్నుతా అంటున్నావ్.. ట్రాక్టర్ డ్రైవర్ వా? అంటూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. నాది ఫాంహౌజ్ కాదు.. ఫార్మర్ హౌజ్ అది అని చెప్పారు. అక్కడ భాజాప్తా వ్యవసాయం చేసుకుంటున్నానని స్పష్టంచేశారు. ప్రగతిభవన్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ అసలు విషయం పక్కకు పెట్టి పనికిరాని విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం వడ్లు కొంటదా? లేదా? అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా బండి సంజయ్ తోకముడిచాడని, అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడాడని ధ్వజమెత్తారు.
నా ఫాంహౌజ్ దున్నుతవా..? నేనేం తప్పుజేసిన.. నా వారసత్వంగా వచ్చిన భూమి అప్పర్మానేరులో పోతే ఇంకోచోట భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్న.. అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో ఇల్లు అమ్మితే వచ్చిన పైసలకు ఇన్ని కలిపి అక్కడనే భాజాప్తాగా ఇల్లు కట్టుకున్న..భాజాప్తా ఉంటా.. బేజాప్తాగా లేను అని వ్యాఖ్యానించారు. అందుకే ఫాంహౌజ్కు వస్తే మెడలు ఇరగ్గొడతా అన్నా అని బండి సంజయ్నుద్దేశించి అన్నారు. తామెప్పుడూ ప్రజలు బాగుండాలనే కోరుకుంటామని, మీలాగా చీప్గా వ్యవహరించమని చెప్పారు. రాయలసీమకుపొయ్యి భాజాప్తా చెప్పిన వాళ్లకు కూడా నీళ్లు రావాలని.. మేం భేషన్లు.. బేషజాలు అడ్డుచెప్పం అని కూడా చెప్పిన.. మనకు సరిపోంగ నీళ్లు మిగిలితే ఇస్తే తప్పేంటి..ఇది పక్కకు పెట్టి..పక్క రాష్ట్రం పొయ్యి కేసీఆర్ చాపల పులుసు తిన్నడు అని బదనాం చేస్తున్నరు.. ఎస్ తిన్న.. వాటిజ్ రాంగ్.. అని బండి సంజయ్ను ప్రశ్నించారు.
మిస్టర్ బండి సంజయ్ నేను అడిగేందేంటి.. నువ్వు చెప్పేదేంటి..? తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కొంటదా కొనదా..? అంటూ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ లేడు అంటవా? నీకు తలకాయ ఉండే మాట్లాడుతున్నవా? నేను లేకపోతే నువ్వున్నవా? అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంల కేసీఆర్ ఎక్కడున్నడు అంటున్నవ్.. నువ్వెక్కడున్నవ్.. ఇప్పుడు మోపైనవ్.. అప్పుడు నువ్వు ఎవనికి తెలుసు రాష్ట్రంల అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ పథకాలళ్ల కేంద్రం పైసలు ఉన్నయా? గొర్రెల పథకంల మీ పైసలున్నాయా..? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు మాట్లాడుతున్నారు.. ఈ పథకం కేంద్రం పైసలు ఏకాణ ఉన్నా నేను రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఎన్సీడీసీ నుంచి అప్పుగా తీసుకొని గొర్రెల పథకం అమలుచేస్తున్నామని, ఇప్పటికీ వడ్డీ కడుతున్నామన్నారు.
తెలంగాణకు నువ్వు ఏంజేసినవ్ అంటడు ఈ మొగోడు.. తెలంగాణలో హనుమాన్ గుడిలేని ఊరులేదు.. సంక్షేమ పథకం చేరని గ్రామం లేదు..మిషన్ భగీరథ ద్వారా నీళ్లు చేరని ఇల్లు ఉందా తెలంగాణల అని బండి సంజయ్ను ప్రశ్నించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలన్నీ మావే అంటున్న బండి సంజయ్.. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవు అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
పెట్రోల్ ధరలు ఎందుకు పెంచిన్రు అని అడిగితే పాకిస్తాన్.. అప్ఘనిస్తాన్ పోర్రి అంటరా..? అరుణాచల్ ప్రదేశ్ల చైనా వాళ్లు ఆక్రమించి ఇండ్లు కడుతున్రు అడ్డుకోన్రి అంటే దేశద్రోహి అని ముద్రవేస్తరా? దేశాన్ని కాపాడండి అని అడిగేవాడు దేశద్రోహా? దేశంలోకి పక్క దేశంవాళ్లు చొరబడ్డా ఏమిజేయనోళ్లు దేశద్రోహులా? అని అడిగారు. వడ్లగురించి ఇడ్షిపెట్టి కేసీఆర్ మీద దేశద్రోహి అని ముద్రవేయండని ఢిల్లీనుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే బండి సంజయ్ అసలు విషయం పక్కకు పెట్టి తనపై దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. మిస్టర్ బండి సంజయ్ ఒళ్లు దగ్గరపెట్టుకో..నేను హద్దు మీరి మాట్లాడిననా..? వడ్డు కొంటరా.. కొనరా అంటే హద్దుమీరుడా..? అని ప్రశ్నించారు.
మాట మాట్లాడితే దళితముఖ్యమంత్రి విషయంలో కేసీఆర్ మాట తప్పారు అంటున్నారని, ఆ మాట వాస్తవమే అయినా దానికి కారణాలున్నాయని, ఆ నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆమోదించారని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడమే అందుకు నిదర్శనమన్నారు. అడ్రస్లేని పార్టీ బీజేపీ అని..అబద్ధాలు చెప్పి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. విద్వేషాలు రెచ్చగొట్టి.. ఒకటి అర సీట్లలో గెలువంగనే ఎగిరెగిరిపడుతున్నారన్నారన్నారు. మేం అట్లగాదు..ఓడిపోతే భాజాప్తా ఒప్పుకున్నం అని సీఎం కేసీఆర్ అన్నారు.
నువ్వు పోసినవా నాకు మందు..?
మాట మాట్లాడితే కేసీఆర్ మందుతాగుతడు అంటున్నవ్.. నువ్వు గిట్ల పోసినవా నాకు మందు..?.. నీ గురువులు నీకు నేర్పిన సంస్కారం గిదేనా? అంటూ బండి సంజయ్నుద్దేశించి చలోక్తి విసిరారు. అడ్డంపొడవు మాట్లాడుతున్నవ్.. నా ఫామ్హౌస్ దున్నుతవా..రా గొర్రెలుంటయ్.. బర్రెలుంటయ్.. నీ అయ్యదా..కష్టపడి కొనుక్కున్నం..ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకో..నువ్వు మాట్లాడేది కేసీఆర్తో అని గుర్తుపెట్టుకో.. ఆరు ముక్కలైతవ్ జాగ్రత్త అని హెచ్చరించారు. కేంద్రంతో వడ్లు కొనిపిస్తవా లేదా చెప్పు..వడ్ల సంగతి ఇడ్సిపెట్టి దొడ్లకెళ్లి దెంకపోయినట్లు ఏదోటి మాట్లాడితే నడవదని అన్నారు. అడుగడుగున నిలదీస్తం..వ్యక్తిగత నిందలను తిప్పికొడతాం.. గింగిరాలు తిరగాలె అని బండి సంజయ్ను హెచ్చరించారు. మెడికల్ కాలేజీపై మాట్లాడవ్..నవోదయ పాఠశాలలపై మాట్లాడవ్..ఇప్పటివరకూ 50 దరఖాస్తులు ఇచ్చినం..మేం జాగాలు చూపియ్యలే అని అబద్ధం ఆడుతున్రు.. మా ప్రాణాలు పోయేవరకూ తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ పథకం పెట్టినా కేసీఆర్ ఇంట్లకెళ్లి ఇత్తుండా అని అంటున్నడు.. నువ్వేమన్నా ఇంట్లకెళ్లి ఇత్తున్నవా? అని బండి సంజయ్ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను నమ్ముతలేరు అని దుష్ప్రచారం చేస్తున్నవ్.. నిన్ను ఏ పాటి నమ్మిన్రు..నాగార్జునసాగర్లో ఏమైంది.. ఇంతకుముందు నీ పార్టీకి డిపాజిట్ అచ్చిందా..అడ్డగోలు వ్యవహారం చేస్తే కేసీఆర్ భయపడడు అని అన్నారు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పోయినవ్ అంటవా..నీకు తెలివి ఉందా..ఎవరు పోతరు మీటింగ్కు.. నువ్వు పోతవా..? నిన్ను గేట్కాడికి కూడా రానిత్తరా? అని బండి సంజయ్పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. అసలు నీకుపరిపాలనా పరిజ్ఞానం ఉందా…? అని ప్రశ్నించారు. ఇన్ని రోజులూ ఏనుగు పోతుంటే కుక్కలు మొరుతయ్ అని ఇడ్సిపెట్టిన..ఇక మీ గ్యాస్, సొళ్లు నడవది..అని తీవ్రస్థాయిలో హెచ్చరిచారు.