హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణిలో తలపెట్టిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు.
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కీలక భూమిక
సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తిచేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకభూమిక పోషిస్తున్నదని సీఎం కేసీఆర్ తన లేఖలో పేరొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్తు ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరుచేసిందని, దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపిందని ప్రధానికి సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
సింగరేణికే కేటాయించండి
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రెంచ్-13 కింద వేలం వేయదలచిన జేబీఆర్వోసీ-3, శ్రావణ్పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే -6 యూజీ బ్లాక్ల వేలం వల్ల సింగరేణి పరిధిలో బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటి వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించవలసిందిగా సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు. ఈ బ్లాక్లను సింగరేణికే కేటాయించేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.