అగ్రహీరో చిరంజీవి జోరు పెంచుతున్నారు. ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరో చిత్ర షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘భోళా శంకర్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించనున్నారు. కీర్తిసురేష్ కీలక పాత్రధారి. నవంబర్ 11న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చిరంజీవి సోదరిగా కీర్తిసురేష్ నటించనున్నది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. 2022లో ఈసినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్.