యుగాల్లో కృతయుగం, తీర్థాల్లో గంగాజలం, దానాల్లో జలదానం, మాసాల్లో వైశాఖం శ్రేష్ఠమని స్కంద పురాణం చెప్తున్నది. వైశాఖ మాసంలో విశిష్టమైన పర్వాలెన్నో తారసపడుతాయి. వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైనదిగా చెప్తారు. వైశాఖ శుక్ల తదియ నాడు చేసే దానాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తారు. పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సత్యయుగంగా పేరొందిన కృతయుగం ప్రారంభమైనది ఇదేరోజని అంటారు. అక్షయ తృతీయను ‘కృత యుగాది’గా ఉత్సవం చేసుకునేవారు. ఈ పర్వదినం ప్రత్యేకతను విష్ణు, భవిష్యోత్తర పురాణాలు వివరించాయి.
ఇదేరోజు సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం జరుగుతుంది. స్వామి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం ఇదేరోజు దక్కుతుంది. పరమ పవిత్రమైన గంగ దివి నుంచి భువికి దిగివచ్చిన రోజు ఇది. భగీరథుడి తపఃఫలంగా అవతరించిన గంగ.. సగరులను తరింపజేసి, సజీవధారగా యుగయుగాలుగా ప్రవహిస్తూ ఉన్నది. గంగాతీరంలో భారతీయ నాగరికత అక్షయమై నేటికీ పరిఢవిల్లుతూనే ఉన్నది.
శ్రీమహావిష్ణువు పరశురాముడిగా అవతరించినది అక్షయ తృతీయనాడే. ప్రజల సంక్షేమాన్ని గాలికివదిలి, ధర్మరక్షణను విస్మరించి నిరంకుశులైన రాజులను తుదముట్టించి ధర్మ సంస్థాపన చేసిన అవతారమూర్తి పరశురాముడు. వైరి క్షత్రియ సంహారం చేసిన తాను సంపాదించిన భూమిని కశ్యపుడికి ధారపోసి మహేంద్రగిరికి వెళ్లి తపోమగ్నుడయ్యాడు. మహాభారతంలో ధర్మరాజు సూర్యారాధన చేసి, ఆదిత్యుడి నుంచి అక్షయపాత్ర పొందినది ఇదే రోజు.
కుచేలుడు శ్రీకృష్ణదర్శనంతో అక్షయమైన సంపదలు పొందినరోజు ఇదేననీ చెప్తారు. ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి, ఆమె స్థితిగతులనూ, దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే! ‘కనకధార స్తోత్రాన్ని’ జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది.కొన్ని ప్రాంతాల్లో అక్షయ తృతీయనాడు గౌరీదేవికి డోలోత్సవం, శ్రీకృష్ణుడికి చందన లేపనం నిర్వహించే సంప్రదాయం ఉన్నది.
ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న అక్షయ తృతీయ నాడు చేసే మంచి పని అక్షయమైన ఫలితాలనిస్తుందని నమ్మకం. అందుకే, ఈ పర్వదినాన బంగారం కొనాలని, అలా కొంటే బంగారం అక్షయం అవుతుందని భావిస్తారు. కానీ, లోకంలో ప్రచారంలో ఉన్న ఈ విశ్వాసానికి ప్రమాణం కనిపించదు. అయితే, అక్షయ తృతీయ సందర్భంగా పుణ్యకార్యాలు ఆచరించాలని పెద్దలు సూచించారు. శక్తి మేరకు దానధర్మాలు చేయాలన్నారు. గొడుగు, పాదరక్షలు, గోవు, భూమి, సువర్ణం, వస్ర్తాలు శక్తిమేరకు దానం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ రోజు చేసిన పుణ్యం అక్షయమై అనంతమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. దానాలే కాక ఈరోజు ఆచరించే వ్రతాలు, నిర్వహించే జపాలు కూడా అక్షయం అవుతాయి. ‘అక్షయ స్వరూపుడైన దైవాన్ని ఆరాధించి, అక్షయమైన అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉన్నరోజు అక్షయ తృతీయ’ అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణగాథ. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న అక్షయ తృతీయ నాడు దానం, జపం, వ్రతం వంటి సత్కార్యాలను ఆచరించి దైవాన్ని ఆరాధించి అనుగ్రహం పొంది మనం ధన్యులం కావాలని గుర్తించాలి. అన్నార్థుల ఆకలి తీరుస్తూ, అవసరార్థులకు అండగా ఉంటూ యథాశక్తి చేసిన దానం అక్షయమై అనంత ఫలాలను మనకు ప్రసాదిస్తుంది.
-ఎ.భరత్ కుమార్