భారతీయ పౌరాణిక సాహిత్యంలో ఆబాలగోపాలానికీ ఉత్సాహం కలిగించే పాత్ర హనుమంతుడు. అసలు హనుమంతుడు అంటేనే ఉత్సాహానికి మారు పేరు. ఆయన ఉన్న దగ్గర నిరుత్సాహం, నిరాశ లాంటి పదాలకు చోటు ఉండదు. రామాయణంలో తొలుత కిష్కింధ కాండలో కనిపించే హనుమ, సుందర కాండలో విస్తరించి కనిపిస్తాడు. హనుమంతుడు సిద్ధుడు. కాబట్టి తన దేహాన్ని పెంచుకోనూ గలడు. కుంచించుకోనూ గలడు. దేహాన్ని విపరీతంగా పెంచిన వీరాంజనేయుడే పెద్ద హనుమంతుడు.
సీతాన్వేషణకు జంబుద్వీపం దక్షిణ అగ్రానికి చేరుకుంటుంది అంగదుడి నాయకత్వంలోని వానరసేన. జాంబవంతుడు, హనుమంతుడు కూడా ఈ బృందంలోని వారే. సముద్రాన్ని దాటి లంకకు వెళ్లడానికి హనుమంతుడు ఒక్కడే సమర్థుడు అని జాంబవంతుడు గుర్తుచేస్తాడు. తన బలం గుర్తుకు రాగానే ఆంజనేయుడికి ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది. ఆయన దేహం ఇంతింతై పెరగ సాగింది. పెరుగుతూ పెరుగుతూ ఆకాశాన్ని అందుకుంది. త్రివిక్రమ వామనుడి ఆకృతి దాల్చిన మారుతి ముఖం సూర్యుడిలా వెలిగిపోతున్నది. కళ్లు తోకచుక్కల్ని తలపిస్తున్నాయి. నాసికా పుటాల నుంచి వెలువడుతున్న శ్వాస అగ్ని పర్వతం నుంచి వస్తున్న వేడివాయువులా ఉంది. ఆయన వాలం అంతెత్తుకు ఎగసి ఒడితిరిగింది. ఆ సమయంలో హనుమంతుణ్ని చూసిన వానరుల్లో భయ సంభ్రమాలు నెలకొన్నాయి. పక్షులు ఆకాశానికి ఎగిరిపోయాయి. క్రూరమృగాలు గుహల్లోకి పారిపోయాయి.
ఇలాంటి వాతావరణంలో సముద్రాన్ని ఆకాశ మార్గంలో దాటడానికి వీలుగా దగ్గర్లో ఉన్న మహేంద్రగిరిపై పాదాలు మోపాడు. దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని చూస్తూ ఆకాశంలోకి ఎగసిన మారుతే పెద్ద హనుమంతుడు. ఇక రామ రావణ యుద్ధంలో.. ఇంద్రజిత్తు అస్ర్తానికి లక్ష్మణుడు ప్రాణాపాయంలో పడతాడు. జాంబవంతుడి సలహా మేరకు సంజీవని మూలిక కోసం హిమాలయాలకు పయనమవుతాడు పవనసుతుడు. అప్పుడూ అంతే. మేను పెంచి పెద్దగా మారిపోతాడు. సంజీవకరణిని సాధించి సౌమిత్రి ప్రాణాలు నిలబెట్టి సంజీవ రాయడిగా నిలిచిపోయాడు. సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చింది పెద్ద హనుమంతుడే.
రావణుడు మరణించాక అతనికంటే బలవంతుడైన శతకంఠ రావణుడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రామలక్ష్మణులు ఏమీ చేయలేకపోతారు. అతణ్ని అంతం చేయాలంటే ఆదిపరాశక్తి ప్రతిరూపమైన సీతతోనే సాధ్యం. అయితే యుద్ధంలో శతకంఠుడి రక్తం బిందువులు నేలమీద పడకూడదు. ఒక్కో బిందువు నుంచి ఒక్కో శతకంఠుడు పుట్టుకొస్తాడు. అందుకని మారుతి మళ్లీ పెద్ద హనుమంతుడు అవుతాడు. పంచముఖ (హనుమ, నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడ) ఆకృతిని దాల్చి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. శతకంఠుడి రక్త బిందువులు నేలమీద పడకుండా వాలాన్ని చాపుతూ వెళ్తాడు. చివరికి హనుమ సాయంతో సీత శతకంఠుడిని పరిమారుస్తుంది. ఇవన్నీ హనుమంతుడి భీమ రూపాన్ని గురించిన వర్ణనలు.
పెద్ద హనుమంతుడు సరే! చిన్న హనుమంతుడు కూడా ఉన్నాడా అంటే… అశోకవనంలో సీతను వెతికే క్రమంలో అక్కడి కాపలాదారుల కంట పడకుండా ఉండేందుకు హనుమ సూక్ష్మరూపాన్ని ధరించాడు. దీనినే తులసీదాసు ‘సూక్ష్మరూప ధరి సియహి దిఖావా/ వికటరూప ధరి లంక జరావా’ అని హనుమాన్ చాలీసాలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తనను పట్టుకోవడానికి వచ్చిన రావణుడి కొడుకు అక్షకుమారుడు సహా లంక సేనలను సంహరించడానికి ఉగ్రరూపాన్ని ధరిస్తాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్ర్తానికి లొంగిపోయి రావణుడి దగ్గరికి వెళ్తాడు. తోకకు నిప్పుపెట్టడంతో లంకను నిర్ధూమధామం గావించిన ఘట్టం ప్రసిద్ధిచెందిందే. సురస, సింహిక సంహార సమయంలో కూడా ఆంజనేయుడు తన శరీరాన్ని పెంచడం, కుదించడం చేశాడు.
ఇలాంటి ఘట్టాల నుంచి స్ఫూర్తి పొందిన పదకవితా పితామహుడు అన్నమయ్య ఆంజనేయుణ్ని ‘పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు’ అని వర్ణించాడు. ఈ ఒక్క కీర్తనలోనే కాకుండా ఇంకా కొన్నింటిలోనూ అన్నమయ్యకు ఆంజనేయుడు ‘పెద్ద హనుమంతుడే’. ఇప్పటికీ ఒక్క భారతదేశంలోనే కాదు, విదేశాల్లో సైతం భారీ ఎత్తుతో హనుమంతుడి విగ్రహాలు వెలుస్తుండటం ఆయనపట్ల ప్రజల్లో నెలకొన్న భక్తి, ఆదరణ, అభిమానం, గౌరవాలకు నిదర్శనం.
చింతలపల్లి
హర్షవర్ధన్