ధర్మరాజు, ఆయన తమ్ముళ్లు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్లను చూడటానికి లోమశ మహర్షి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత లోమశుడు, ‘ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది’ అని సలహా ఇచ్చాడు.
లోమశుడి మాట ప్రకారం కొన్నాళ్లకు పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్లారు. అలా వెళ్లినప్పుడు వాళ్లకు గంగానది ఒడ్డున రైభ్య మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే భరద్వాజుని ఆశ్రమం ఉంది. భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. నదీ తీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పర్చుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు పరావసు, అర్వావసు. వాళ్లిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరు పొందారు. భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. అతనికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు. పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు.
పరావసు, అర్వావసుల కన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుణ్ని గురించి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్లంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూ లోకానికి వచ్చి, ‘ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. ‘ఎవరూ చదువని వేద విద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ని కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువు గారి దగ్గరికి పోవటం, ఆశ్రమవాసం చేయడం, కొన్నాళ్లు ఆయనకు సేవ చేయటం నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాల మీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి’ అని యవక్రీతుడు వేడుకున్నాడు. అది విని ఇంద్రుడు నవ్వాడు. ‘పిచ్చివాడా! నీ తెలివి అపమార్గం పట్టింది. తక్షణమే వెళ్లి గురువును ఆశ్రయించు. ఆయన దగ్గర శుశ్రూష చేసి వేద విద్యలన్నీ నేర్చుకో. గురువు వద్ద నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు’ అని హితవు పలికాడు.
కానీ, యవక్రీతుడుకి ఇంద్రుడి మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సుకు పూనుకున్నాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి, ‘నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్లి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్లు కాల్చుకోవటం మానుకో’ అని చెప్పాడు. యవక్రీతుడికి కోపం వచ్చి, ‘నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను’ అన్నాడు.
అలా ఉండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్లాడు. అక్కడ ఓ వృద్ధుడు నది ఒడ్డున కూర్చుని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు ‘ఏం చేస్తున్నావు. తాతా?’ అని అడిగాడు. ‘గంగానది దాటడానికి వంతెన కడుతున్నా’ అన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాటలకు యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. ‘వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్టవేయడం కుదరని పని. వేరే మార్గం చూడు’ అని సలహా ఇచ్చాడు. ‘గురువు లేకుండానే, అసలు చదువకుండానే, కష్ట పడకుండానే విద్య రావాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో! అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా’ అని వృద్ధుడు బదులు చెప్పాడు.
ఆయన ఎవరో యవక్రీతుడికి అప్పుడు అర్థమైంది! వెంటనే కాళ్లమీద పడ్డాడు. ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుడిని దగ్గరకు తీసుకుని, ‘నీ తండ్రి దగ్గర వేద విద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు’ అని ఆశీర్వదించాడు.
ప్రయాగ రామకృష్ణ