హైదరాబాద్ : శంషాబాద్ ముచ్చింత్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఈ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ రామాజానుల సహస్రాబ్ది వేడుకలు జరుగనున్నాయి. అలాగే 200 ఎకరాల్లో రూ.1000 కోట్లతో నిర్మించిన 216 అడుగుల భగవత్ రామానుజుల (సమతామూర్తి) పంచలోహ విగ్రహావిష్కరణ మహోత్సవం జరుగనున్నది. ఈ సందర్భంగా మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావుతో కలిసి చినజీయర్ స్వామి పలువురు కేంద్రమంత్రులను కలిసి ఆహ్వానాలు అందజేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వేడులకు ఆహ్వానించి, ముచ్చింతల్లో రామానుజ ప్రాజెక్టుపై, భగవత్ రామానుజుల జీవిత విశేషాలు, కార్యక్రమ విశిష్టతను గంటపాటు అమిత్షాకు చినజీయర్ స్వామి వివరించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతానని అమిత్ షా చినజీయర్ స్వామికి హామీ ఇచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను కలిసి వేడుకలకు ఆహ్వానించారు. ప్రాజెక్టు విశేషాలను తెలుపగా మోహన్ భగవత్ ఆసక్తిగా విని.. చినజీయర్ స్వామి చేపట్టిన మహా యజ్ఞాన్ని అభినందించారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి వేడుకకు రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. మైహోం గ్రూప్ చైర్మన్ రామేశ్వర్రావు, కేంద్రమంత్రికి కార్యక్రమాలపై వివరించారు. అలాగే ఇంతకు ముందు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజే, నితిన్ గడ్కరీ, కిషన్రెడ్డికి సైతం ఆహ్వాన పత్రాలు అందించి సమతా విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు.