కావలసిన పదార్థాలు
చికెన్ కీమా: అర కిలో, గోధుమపిండి, మైదాపిండి: ఒక కప్పు చొప్పున, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పెరుగు: అర కప్పు, కారం: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, వెన్న: ఒక టేబుల్ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, క్యాబేజీ, క్యాప్సికం తురుము: పావు కప్పు చొప్పున, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఒక గిన్నెలో చికెన్ కీమా, పెరుగు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూతపెట్టి గంటపాటు ఫ్రిజ్లో పెట్టాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, మైదాపిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లుపోసి ముద్దగా చేసి అరగంటపాటు మూతపెట్టి పక్కన ఉంచాలి. స్టవ్ మీద పాన్ పెట్టి వెన్న వేసి.. వేడయ్యాక నానబెట్టిన చికెన్ జోడించి కలుపుతూ పావుగంటపాటు సన్నని మంటపై ఉడికించాలి. బాగా ఉడికిన చికెన్లో క్యాప్సికం, క్యాబేజీ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి దింపేయాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని మందపాటి చపాతీలా ఒత్తి మధ్యలో చికెన్ మిశ్రమం పెట్టి అంచులు ముడిచి పరోటాలా ఒత్తు కోవాలి. వాటిని పెనం మీద వేసి రెండు వైపులా నూనె లేదా వెన్నతో కాల్చుకుంటే వేడివేడి చికెన్ పరోటాలు సిద్ధం.