సిటీబ్యూరో/మెహిదీపట్నం, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ) : ఉత్తర భారతీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఛఠ్ పూజను గ్రేటర్లో కన్నులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వం 29 ప్రాంతాల్లోని చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా హుస్సేన్సాగర్ తీరానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పూజలను ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొని సందడి చేశారు. చెరువుల వద్ద కుటుంబ సమేతంగా ఒకేచోట చేరి సూర్య భగవానుడిని ప్రార్థించారు. సూర్యోదయం సమయంలో వ్రతంలో ఆచరించే పద్ధతులతో రోగనిరోధక శక్తి లభిస్తుందని, చెరువులో స్నానం ఆచరించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయని భక్తులు తెలిపారు. అదేవిధంగా, లంగర్హౌస్ బాపూఘాట్ సమీపంలోని తపోవనంలో బుధవారం రాత్రి ఛఠ్ పూజను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఇతర రాష్ర్టాల సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గౌరవిస్తున్నారని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.