చెన్నై : నటుడు వివేక్ మరణంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని, అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్ -19 టీకా డ్రైవ్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నటుడు మన్సూర్ అలీ ఖాన్పై తమిళనాడులోని వడపళని పోలీసులు కేసు నమోదు చేశారు. మాస్కులు ధరించడం మానేయాలని, నటుడి మరణానికి ప్రభుత్వాన్ని నిందించాలని పేర్కొంటూ ఖాన్ శనివారం చెన్నై ఆసుపత్రిలో అలజడి సృష్టించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే ప్రచారానికి పాల్పడ్డాడని పేర్కొంటూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నటుడిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అనుసరించి పోలీసులు ఖాన్ పై సెక్షన్ 153(అల్లర్లకు కారణమయ్యే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం), సెక్షన్ 270(ప్రాణాంతక వ్యాధి సంక్రమణను వ్యాప్తి చేయడం) సెక్షన్ 505 (1) (పుకార్ల వ్యాప్తి), 505 (1) (బి) (ప్రజలకు భయం కలిగించే ఉద్దేశ్యంతో పుకారును వ్యాప్తి చేయడం), అలాగే అంటువ్యాదుల చట్టం, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీనిపై నటుడు ఖాన్ ముందస్తు బెయిల్ కోరుతూ ప్రిన్సిపాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు.