‘There is no greater agony than bearing an untold story inside you.’
– Maya Angelou
సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు. అన్నిటిలో కెల్లా విశిష్టమైనది కథాప్రక్రియ. సాహిత్యం మనిషి జీవితానికి అద్దంలాంటిదంటారు. జీవితంలోని సంఘటనలు, సందర్భాలు, సంఘర్షణలను, వేదనలను, ఆనందాలను, ఆలోచనలను అన్నింటినీ గుదిగుచ్చి ఒక చోట చేర్చి ఆకట్టుకొనేలా చెప్పగలిగిన అక్షర రూపమే సాహిత్యం. అయితే ఆ సాహిత్యంలో ఉండే ఎన్నో ప్రక్రియలలో జీవితంలోని అన్ని పార్శ్వాలనూ వివరంగా అక్షరీకరించగలిగిన విశిష్ట సాహితీ ప్రక్రియ ‘కథ’.
కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితిలో రచయితలు, కవులు మొదట్లో కొంత స్తబ్దంగా అయినప్పటికీ, వెంటనే తేరుకుని కలాలకు పదును పెట్టారు. కొత్త కథా, కవితా వస్తువు పుట్టింది. ఇంకేం, కరోనా కేంద్రంగా ఎన్నెన్నో కవితలు, కథలు పుట్టుకు వచ్చాయి. తెలుగు వాళ్ళు కూడా అలా సహజంగానే స్పందించారు.
కథలో భాషావిశేషాలు, జీవన విలువలు సాంస్కృతిక నేపథ్యం, మనుష్యులు వారి వ్యక్తిత్వాలు, ప్రవర్తనలు వాటన్నింటి నేపథ్యంలో ప్రపంచానికి చాటి చెప్పే ఒక సందేశం లేదా ఒక అనుభవం కలగలిసి ఉంటాయి. అందుకే సాహిత్య ప్రక్రియలన్నింటిలో కథకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. జీవితం ఎంతో బహుముఖీనమైనది. అలాంటి జీవితాన్ని అక్షరీకరించడం, పదాలలోకి కుదించడం మొత్తంగా సాధ్యంకాదు. అయినప్పటికీ విస్తృతమైన జీవన చిత్రాన్ని అక్షరాలలో సంకేతాలలో, ప్రతీకలలో చూపించగలిగే చక్కని సాహితీ ప్రక్రియగా ‘కథ’కు గుర్తింపు ఉన్నది. అందుకే ‘The human species thinks in metaphors and learns through stories’ అని ప్రఖ్యాత పుస్తకం ‘With a Daughters Eye’ని రాసిన అమెరికన్ రచయిత్రి, Cultural Anthropologist అయిన Mary Catherine Bateson చెప్పారు.
ప్రపంచ సాహిత్యంలో ఆది నుంచి ఆచరణలో ఉన్న సాహితీ ప్రక్రియ కథ. ఆదిమ మానవుడి కాలం నుంచి, భాష ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి, ఒక తరం తన అనుభవాలను మరో తరానికి అందించడానికి, తద్వారా తమదైన సంస్కృతిని, సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడానికి ‘కథ’లుగా తర్వాతి తరాలకు అందించడం అనే కథన సంప్రదాయమే కారణం అని చెప్పాలి.
సాహిత్యం మౌఖిక రూపంలో ఉన్న కాలంలో కూడా కథన శైలియే అగ్రస్థానం వహించింది అనేది మనకు మానవీయశాస్త్ర (Anthropological) అధ్యయనం ప్రకారం అర్థమవుతుంది. భాష రూపొందిన తర్వాత భావ వినిమయ సాధనంగా భాషకు గుర్తింపు వచ్చిన తర్వాత కథనం అనేది ఒక జాతి వారసత్వ సంపదగా కొనసాగింది. అలాంటి నేపథ్యంలో నుంచి కథ పుట్టిన తర్వాత ప్రతి భాషలో ప్రతి సాహితీ ప్రక్రియలో కథ ఆయా జాతుల జీవనశైలులకు, ఆయా తరాల జీవన విలువలకు అద్దం పడుతూ దానికి సంక్షిప్త రూపంగా కొనసాగుతూ వస్తున్నది.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కథన శైలి లిఖిత రూపంలో దర్శనమిచ్చింది బొకేషియో రాసిన ‘ది 2 కామెరాన్’ గ్రంథం ద్వారా. అలాగే ఆంగ్ల సాహిత్య పితామహుడిగా పరిగణించే జెఫ్రీ ఛాసర్ రాసిన ‘Canterbury Tales’ గ్రంథం కథన శైలిలో ఉండే సాహిత్య రూపంలో మనకు లభిస్తున్నాయి.
తెలుగులో తొలి సాహిత్యంగా చెప్పబడిన ‘మహాభారతం’ కూడా కథన సంప్రదాయానికి సంబంధించిందే. దాంట్లో ఉండే ఎన్నో చిన్న కథలు, ఉపాఖ్యానాలు అన్నీ కూడా కథా సాహిత్య తొలి వెలుగులే. అందుకే ఈ కావ్యంలో నన్నయ విరచిత ‘ఆది’, ‘సభా’, ‘అరణ్యపర్వంలోని అర్థభాగా’లలో కథా గమనంలో కనిపించే సంక్షిప్తత, కుతూహలం, ఉత్తేజం వంటి లక్షణాలుంటాయి. పోతన రాసిన ‘శ్రీమద్భాగవతం’లో శ్రీకృష్ణుడు జీవన ఘట్టాలన్నీ చిన్నచిన్న కథలుగా, లీలలుగా ఉండి, కథా లక్షణాలలోని ఉత్సుకతని, ఆసక్తిని పాఠకులలో కలిగిస్తాయి. కాగా, తెలుగులో మొట్టమొదటి సారిగా కథా లక్షణాలతో కూడిన రచనను 1911లో ‘దిద్దుబాటు’ అనే కథ ద్వారా గురజాడ అప్పారావు చేశారని భాషావేత్తలు, చరిత్రకారులు గతంలో నిర్ధారించారు. కానీ తర్వాత జరిగిన పరిశోధనల్లో వెల్లడైన ఒక అద్భుతం ఏమిటంటే, భండారు అచ్చమాంబ 1910 ప్రాంతంలోనే చక్కని కథా లక్షణాలతో కూడిన కథా సాహిత్యాన్ని సృష్టించారని తెలుస్తున్నది.
‘Theres always room for a story that can transport people to another place’ అని ప్రఖ్యాత Harry Potter Series గ్రంథాల రచయిత్రి J.K. Rowling అన్నట్లు పాఠకులను, ప్రజలను అక్షరాల వెంట పయనింపజేస్తూ, ఆయా నేపథ్యాలతో మమేకం అయ్యేలా చేయగలిగే సత్తా ఉన్న కథలను ఎన్నిటినో అభ్యుదయ, విప్లవ, అస్తిత్వవాదాలు తెలుగు సాహిత్యానికి అందించాయి.
ఇదే సందర్భంలో ఒక మనోవైజ్ఞానిక పరమైన అంశాన్ని కూడా మనం గమనించాలి. కథన శైలి, కథా సంప్రదాయం, కథలు (Narrative style) చెప్పగలిగే విధానం అనేది స్త్రీలకు సహజంగా అబ్బిన సహజాతం అని చెప్పొచ్చు. వారి మాట తీరు, పెరిగిన జీవనవిధానం, సామాజిక కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆ ప్రకారం జరిగే అంశాలు అన్నీ కలిసి స్త్రీలలో సహజమైన కథనరీతిని, కథన శైలిని, కథన నైపుణ్యాలను పెంపొందింపజేసి ఉంటాయని Psychologists మానవుల మేధాశక్తుల మీద పరిశోధనలలో తేలింది అని చెప్పొచ్చు.అందుకే కథలు అనగానే మనకు అమ్మ లేదా అమ్మమ్మలు గుర్తుకు వస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కథా సాహిత్యంలో స్త్రీలు విస్తృతంగా కృషి చేశారు.
తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ కూడా చాలా మంది మహిళలు చక్కని కథా సేద్యం చేసి తెలంగాణ సాహితీక్షేత్రంలో గొప్ప పంటను పండించారు. వారిలో నందగిరి ఇందిరాదేవి, బొమ్మ హేమాదేవి, పాకాల యశోదారెడ్డి లాంటి వారు ఎంతోమంది ఉన్నారు. సమకాలీన కాలంలో లెక్కకు మిక్కిలి చక్కని కథా రచయిత్రులు తమదైన శైలిలో వివిధ రకాల జీవన విలువలను, సంప్రదాయాలను తమ కథల్లో ప్రతిబింబిస్తున్నారు.
తెలుగులో కథాసాహిత్య పరిణామంలో మొదట కుటుంబ కథా వస్తువులే ప్రధానాంశంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో అభ్యుదయవాదం, ఆ తర్వాత విప్లవాలు, ఆ తర్వాత అస్తిత్వవాద ఉద్యమాల నేపథ్యంలో కథా సాహిత్యాన్ని ఆయా రచయితలు విస్తృతంగా సృష్టించారు. అస్తిత్వవాద కథా సాహిత్యంలో స్త్రీవాదం, మైనారిటీవాదం, దళితవాదం, ప్రాంతీయ అస్తిత్వవాదం ప్రధాన భూమికను పోషించాయి. ఇలాంటి కథాసాహిత్యం గత రెండు మూడు దశాబ్దా ల కాలం నుంచి సృష్టించబడుతున్నది. ఆయా వాదాల నేపథ్యంతో కథా సాహిత్యం ప్రజలందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంబేద్కర్ వాదాన్ని, బుద్ధుడి బోధనలను, సర్వమానవ సమానత్వాన్ని చెప్పగలిగిన కథలు కూడా ఎన్నో వచ్చాయి.
రచయితకు ఒక హృదయనేత్రం ఉంటుంది! ఒక సృజనాత్మక దృక్కోణం ఉంటుంది. ఒక సామాజిక దృక్పథం ఉంటుంది. ఆ కండ్లకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. వీటన్నింటి వల్ల కథకుల నుంచి ఇప్పటివరకు వచ్చిన, ఇప్పుడు వస్తున్న రచనలు కానీ, రాబోయే కాలంలో వచ్చే కథలు గానీ, మరింత సమాజహిత భావనతో, సమాజంలో ఉండే అంతరాలపై ఎక్కుపెట్టే బాణాలుగా, మార్పుకి సంకేతంగా నిలుస్తాయని ఆశించవచ్చు. అమెరికన్ ఇండియన్లలో Hopi జాతి ప్రజలలో ఉండే సామెత ‘Those who tell the stories rule the world’ అన్న మాటను నిజం చేసేలా ఉంటాయని ఆకాంక్షించవచ్చు.
-మామిడి హరికృష్ణ,
80080 05231