కాలం మారుతున్నట్టే.. వ్యాపార ధోరణీ మారుతోంది. మునుపటిలా కూరగాయలు కొనాలంటే మార్కెట్కో.. షాపింగ్ కోసం బట్టల దుకాణానికో.. టిఫిన్, భోజనం చేయాలంటే హోటల్కో వెళ్లే అవసరం తప్పింది. ఇప్పుడవన్నీ రోడ్డు పక్కనే దొరుకుతున్నాయి. అది నిత్యావసర వస్తువైనా.. పిల్లలు ఆడుకునే బొమ్మలైనా.. మేళాలో దొరికే అరుదైన కళాఖండాలైనా ‘ఏ టు జడ్’ అందుబాటులోకి వచ్చాయి. దైనందిన జీవితంలో తీరిక లేని ప్రజల కోసం చిరువ్యాపారులు ఇలా రోడ్లనే అడ్డాలుగా చేసుకొని బిజినెస్ చేయడం నయా ట్రెండ్గా మారింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో వందలాది మందికి ఉపాధి దొరుకుతోంది. మార్కెట్ కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు ఆసక్తి చూపిస్తుండగా విస్తరించే దుకాణాల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది.
మనం ఏ నిత్యావసర వస్తువు కొనాలన్నా అందుబాటులో ఉన్న మార్కెట్కు లేదా దుకాణాలకు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ వస్తువు కావాలన్నా రోడ్డు పక్కనే దొరుకుతోంది. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో ఓపిక, తీరిక లేని పరిస్థితుల్లో రోడ్డు మీద ప్రయాణం చేస్తూనే అవసరమైనవి కొంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న చిరు వ్యాపారులు.. రోడ్లనే తమ బిజినెస్ సెంటర్లుగా మార్చుకున్నారు. బయటి కంటే తక్కువ ధరకే అందిస్తూ తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. ఈ నయా బిజెనెస్ ట్రిక్తో లాభాలు ఎక్కువ వస్తుండడంతో విక్రయాలు ఊపందుకొని రోడ్డు పక్కన మరిన్ని దుకాణాలు వెలుస్తున్నాయి.
ఇదివరకు రైతులు కూరగాయలను మార్కెట్కు తీసుకెళ్లి అమ్మేవారు. కొందరు ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లి వ్యాపారులకు విక్రయించేవారు. మరికొందరు స్వయంగా మార్కెట్లో కూర్చుని అమ్ముకునేవారు. దీని వల్ల ఒక పూట పని పోవడమే కాకుండా రానుపోను ఖర్చులు భరించాల్సి వచ్చేది. వినియోగదారులు కూడా మార్కెట్కే వెళ్లి కూరగాయలను కొనుక్కునేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు రైతులు ఓ వైపు పొలాల్లో పనులు చేసుకుంటూ.. ఆ తర్వాత రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇలా ఒక రైతులే కాకుండా చాలామంది చిరు వ్యాపారులు రోడ్డునే తమ వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. గతంలో ఒక వ్యాపారం చేయాలంటే పట్టణాల్లో ఒక రూము కిరాయి తీసుకొని అడ్వాన్స్ చెల్లించడంతో పాటుగా నెలనెలా కిరాయిలు, కరంటు బిల్లులు, మెయింటనెన్స్.. ఇలా బోలెడంత ఖర్చు అయ్యేది. ఇప్పుడు అవేవీ లేకుండా కూరగాయలు విక్రయించే వారి వలే వీరు కూడా రోడ్డు పక్కన వ్యాపారాలు మొదలుపెట్టారు.
సొంతంగా వాహనాలను సమకూర్చుకుని టిఫిన్ సెంటర్, మధ్యాహ్న భోజనం, బిర్యానీలు, అన్ని రకాల దుస్తులు, కండ్లద్దాలు, ఉల్లిగడ్డలు, పండ్లు, జ్యూస్లు, ఎలక్ట్రిక్ వస్తువులు, డ్రై ప్రూట్స్, చెప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో ప్రస్తుతం అన్ని రకాల వస్తువులు, తినుబండారాలు మొత్తంగా రోడ్డు పక్కనే దొరుకుతున్నాయి. హోటల్కే వెళ్లి తినాలి, దుకాణానికే వెళ్లి వస్తువులు కొనాలనే ఆలోచన నుంచి వినియోగదారులు క్రమక్రమంగా బయటపడి రోడ్డు పక్కనే ప్రయాణం చేస్తూనే తమకు కావాల్సినవి కొనుగోలు చేసుకుంటున్నారు. తాజా కూరగాయలు, ఇతర వస్తువులు తక్కువ ధరలకే వస్తుండడంతో వినియోగదారులు రోడ్డు పక్కన వ్యాపారుల వద్ద కొనేందుకే ఇష్టపడుతున్నారు. రైతులు, చిరు వ్యాపారులు సైతం తమకు ప్రయాణ ఖర్చులు, అద్దె, కరంటు చార్జీలు, మెయింటనెన్స్ ఖర్చుల భారం లేకపోవడంతో తక్కువ ధరకే అమ్ముతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
ఇదివరకు గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు, ఆటోలు ఎక్కితే మళ్లీ పట్టణాల్లోనే దిగేవారు. మధ్యలో ఆగేందుకు వీలుండేది కాదు. ఇప్పుడు దాదాపు అందరి దగ్గర ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నాయి. ఉద్యోగులు, ప్రజలు తమ ఆఫీసులకు, బిజినెస్లకు, ఇతర పనులకు తమ వాహనాల్లోనే వెళ్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, ఇతర వస్తువులను రోడ్డు పక్కనే కొనుక్కుని వెళ్తున్నారు. ఉదయం వెళ్లే వారు కొందరు రోడ్డు పక్కన బండ్లపై ఉన్న టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ తినేస్తున్నారు. ఇలా రోడ్డు పక్కన కాదు.. మరికొందరు స్వయంగా గ్రామాల్లోకే వచ్చి కూరగాయలు, పండ్లు, ఉల్లిగడ్డలు, దుస్తులను ట్రాలీ ఆటోల్లో అమ్ముతున్నారు. ప్రజల జీవితంలో ముడిపడి ఉన్న ప్రతి వస్తువును వాడవాడలకు వచ్చి విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఏ వస్తువైనా రిపేర్ ఉంటే ఇది వరకు పట్టణాలకు వెళ్లి చేయించుకునే వారు. కానీ ప్రస్తుతం ఫ్యాన్లు, కూలర్లు, గ్యాస్స్టౌవ్లు, కరంట్ మోటర్లు, రిఫ్రిజిరేటర్లు ఇలా ఏ వస్తువునైనా బాగు చేసి ఇస్తుండడం విశేషం. రోడ్డు పక్కన వ్యాపారాలు అటు వినియోగదారులకు, చిరు వ్యాపారులకు లాభసాటిగా ఉంటుండడంతో రోజురోజుకు అన్ని రకాల వ్యాపారాలు సైతం రోడ్డు పక్కకే వచ్చి చేరుతున్నాయి.