‘ఆర్ఎక్స్ 100’తో యువతరం ప్రేక్షకుల్ని మెప్పించారు కార్తికేయ. తనకున్న మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని వైవిధ్యమైన ప్రేమకథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారాయన. కార్తికేయ హీరోగా నటించిన మరో ప్రేమకథా చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్ నిర్మించారు. ప్రచార చిత్రాలు, పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు చేరుకుందో చూద్దాం…
బాలరాజు(కార్తికేయ) మార్చురీ వ్యాన్ డ్రైవర్. ప్రతిరోజు శవాలను, ఏడుపుల్ని చూసి చావుపై అతడిలో తేలికభావం ఏర్పడుతుంది. చావు ప్రతి ఒక్కరికీ తప్పదు కాబట్టి ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలనే సిద్ధాంతంతో బతుకుతుంటాడు. మల్లిక (లావణ్య త్రిపాఠి) భర్త పీటర్ చనిపోతాడు. పీటర్ అంత్యక్రియల్లోనే మల్లికను చూసిన బాలరాజు ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. భర్త చనిపోయిన బాధలో ఉన్న మల్లిక తొలుత అతడిని ద్వేషిస్తుంది. కానీ బాలరాజు ఆమెలోని ద్వేషాన్ని పట్టించుకోడు. బాలరాజు ప్రేమను మల్లిక అర్థంచేసుకుందా?వారి ప్రేమబంధం పెళ్లిపీటలవరకు చేరుకుందా?లేదా?కొడుకు అమితంగా ప్రేమించే తల్లి గంగమ్మ(ఆమని) కారణంగా జీవితం విలువను, చావు తాలూకు వేదనను బాలరాజు ఎలా అర్థంచేసుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
చావు పుట్టుకల అంతర్యాన్ని, వాటి పట్ల మనుషుల్లో ఉండే అభిప్రాయాల్ని, సంఘర్షణను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమిది. మనిషికి చావు అనివార్యమని ఆ చేదు జ్ఞాపకాల్ని తల్చుకుంటూ జీవితాంతం బాధపడటంలో అర్థంలేదనే పాయింట్కు కమర్షియల్ హంగుల్ని జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ తాత్విక అంశాలకు మెటర్నిటీ వార్డులో పనిచేసే నర్సుకు, మర్చురీ వ్యాన్ డ్రైవర్ మధ్య ప్రేమకథను, కుటుంబ విలువలి దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ కథను సిద్ధంచేశారు.
బస్తీ బాలరాజు పాత్ర పరిచయం, అతడి లైఫ్ ఫిలాసఫీని పాట రూపంలో చెబుతూ ఆసక్తికరంగా సినిమాను మొదలుపెట్టారు దర్శకుడు. మల్లికను ప్రేమించమంటూ బాలరాజు వెంటపడే సన్నివేశాలతో ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది. ద్వితీయార్థాన్ని కుటుంబ బంధాల నేపథ్యంలో ఉద్వేగభరితంగా నడిపించారు. ఆమని, కార్తికేయ, మురళీశర్మ, లావణ్యత్రిపాఠి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ సెంటిమెంట్ కలబోతగా హృద్యంగా ఉంటాయి.
మార్చురీ వ్యాన్ డ్రైవర్ బాలరాజుగా మాస్ పాత్రలో చక్కటి నటనను కనబరిచారు కార్తికేయ. నచ్చినట్లుగా జీవితాన్ని గడపాలనే సిద్ధాంతమున్న యువకుడిగా అతడి పాత్రను దర్శకుడు నవ్యరీతిలో తెరపై ఆవిష్కరించారు. కామెడీ, ఉద్వేగాల సమ్మిళితంగా సాగే ఈ పాత్రలో చక్కటి వేరియేషన్స్ను కనబరిచాడు కార్తికేయ. ప్రేమించే భర్తకు దూరమై మనసులో అంతులేని వేదనను దాచుకున్న యువతిగా లావణ్య త్రిపాఠి కనిపించింది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఎమోషనల్గా ఆమె పాత్ర సాగింది.
డీ గ్లామర్ లుక్లో సాగే ఈ పాత్రలో లావణ్య సహజ నటనను కనబరించింది. గంగమ్మ పాత్రలో ఆమని తన అభినయంతో ఆకట్టుకుంటుంది. కెరీర్లో పూర్తిస్థాయి మాస్ పాత్రలో కనిపించడం ఆమనికి ఇదే తొలిసారి. వైవిధ్యతను కనబరచడానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె చక్కగా ఉపయోగించింది. మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు రొటీన్గా సాగతాయి. భద్రం, మహేష్ కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. తొలి సినిమా కోసం చాలా మంది యువ దర్శకులు ప్రేమ, రొమాంటిక్ కథల్ని ఎంచుకుంటుంటారు.కానీ దర్శకుడు కౌశిక మాత్రం పుట్టుక, మరణం మధ్య మనిషి పడే అంతఃసంఘర్షణను ఆవిష్కరిస్తూ ఈ కథను రాసుకున్నారు.
సున్నితమైన అంశాన్ని అర్థవంతంగా చెప్పే ప్రయత్నంలో కొంత మేర సఫలమయ్యారు. అయితే చిన్న పాయింట్కు కమర్షియల్ హంగుల్ని మేళవిస్తూ ఆసక్తికరంగా చెప్పడానికి దర్శకుడు ఎక్కువగా పాటలపై ఆధారపడినట్లు కనిపిస్తుంది. అలాగే బాలరాజు, మల్లిక ప్రేమకథలో వేగం మందగించింది. బాలరాజు ప్రేమను మల్లిక అర్థం చేసుకునే సన్నివేశాల్ని కన్వీన్సింగ్గా రాసుకుంటే బాగుండేది. జేక్స్ బిజాయ్ బాణీలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ‘కదిలే కాలాన్నడిగా’తో పాటు పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. బస్తీ వాతావరణాన్ని ఛాయాగ్రాహకులు సునీల్రెడ్డి, కరమ్చావ్లా సహజంగా చూపించారు. కొత్త దర్శకుడి ఆలోచనను నమ్మి బన్నీవాస్ చక్కటి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
రెగ్యులర్ కమర్షియల్ పంథాకు భిన్నంగా సాగే చిత్రమిది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రేక్షకులు మెచ్చే వినోదం కూడా జోడించి వుంటే ఈ చిత్రం అన్ని వర్గాల మెప్పు పొందేది..
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.