కొలంబో: ఆమె పేరు సుషీయినే. పుట్టిపెరిగింది చైనాలో. చెప్పుకుంటుంది శ్రీలంక యువరాణినని. మే 26న బీజింగ్ లోని శ్రీలంక రాయబార కార్యాలయంలో జరిగన ‘వేశాఖ’ ఉత్సవాలకు హాజరైంది. ఈ వార్త సహజంగానే శ్రీలంకలో గుప్పుమంది. ఈ యువరాణి వెనుక ఓ కథ ఉంది. 15వ శతాబ్దంలో శ్రీలంకలోని కొట్టె ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆరో పరాక్రమబాహు రాజుతో సంబంధం కలిగిన ఓ యువరాజు చైనాకు వెళ్లి అక్కడే ఓ చైనా అమ్మాయిని చేసుకుని స్థిరపడిపోయాడు. అతనికి సుషీయినే 19వ తరపు వారసురాలట. అందుకే ఉత్సవాల్లో పాల్గొందట. అసలే మెల్లమెల్లగా చైనా ఆధిపత్యం కిందకు పోతున్న శ్రీలంకలో ఈ వార్త ఆగ్రహావేశాలకు కారణమైంది. తన ఉనికిని సమర్థించుకునేందుకు చైనా ఏదోరకంగా చుట్టరికం కలపాలని చూస్తున్నదని అనేకమంది శ్రీలంక పౌరులు నెట్లో మండిపడుతున్నారు. 1990లలో కింగ్యువాన్ పర్వతంపై గల షిజియా సమాధులు అభివృద్ధి ప్రాజెక్టు కింద ధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడే శ్రీలంక యువరాణి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొట్టె అంటే కొంచెం అటూఇటుగా ప్రస్తుత కొలంబో ప్రాంతం. అక్కడి నుంచి చైనాకు వెళ్లిన యువరాజు శ్రీలంకకు ఎందుకు తిరిగిరాలేదు అనేదానికి రెండు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. తండ్రి నుంచి సింహాసనాన్ని బలవంతంగా లాక్కుని సోదరులను హతమార్చిన మరో యువరాజు కారణంగానే చైనాకు వెళ్లిన యువరాజు వెనుకకు తిరిగిరాలేదని ఒక కథనం ప్రచారంలో ఉంది. కానీ సుషియినే మాత్రం తాను ప్రేమించిన చైనా అమ్మాయిని వదిలి రాలేక యువరాజు అక్కడే స్థిరపడిపోయాడని అంటున్నది. చైనాకు వెళ్లింది యువరాజు కాదు వీరుడైన రాజు అలకేశ్వరుడని చెప్పే మరో కథ కూడా ఉంది. చైనా మింగ్ రాజవంశానికి చెందిన సైన్యాధికారులు అతడిని బందీగా పట్టుకుని చైనాకు తీసుకుపోయారట. అక్కడ మింగ్ చక్రవర్తి అతడికి క్షమాభిక్ష పెట్టాడట. ఆ తర్వాతే ఆరో పరాక్రమబాహును శ్రీలంకకు రాజును చేశారట. ఈ కథలన్నీ కూడా గమ్మత్తుగా ఉంటాయి. వీటిని ధ్రువీకరించేవారే కరువయ్యారు. తాజాగా “యువరాణి”ని చైనా తెరెమీదకు తేవడం శ్రీలంకను క్రూరంగా అపహాస్యం చేయడంగా పలువురు నిరసిస్తున్నారు. పాత చుట్టరికం కలిపి కొత్త ఆధిపత్యానికి చైనా పునాదులు వేసుకుంటున్నదని మరికొందరు విమర్శిస్తున్నారు.