న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. పలు దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరించింది. ఆయా దేశాల నుంచి భారత్లోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కఠినమైన స్క్రీనింగ్, టెస్టులు నిర్వహించాలని ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం ఆదేశించింది.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచనలు చేశారు. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బీ.1.1.529 వేరియంట్ను గుర్తించారు. ఇప్పటికే కొత్త వైరస్ కేసులు దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంగ్కాంగ్లోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, కాంటాక్టులను తప్పనిసరిగా ట్రాక్ చేయడంతో పరీక్షలు చేయాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా B.1.1.529 వేరియంట్ లక్షణాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వేరియంట్ గుర్తించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.