దేశీయ మార్కెట్ను సిమెంట్ ధరలు హీటెక్కిస్తున్నాయి.బహిరంగ మార్కెట్లో బస్తా ధర మరో రూ.50 ఎగిసే వీలున్నది.క్రిసిల్.. ఇక్రా.. క్రెడాయ్.. సంస్థ ఏదైనా ఇప్పుడు చెప్తున్నదొక్కటే.రాబోయే రోజుల్లో సిమెంట్ ధరలు
చుక్కలు చూపించడం ఖాయమన్నదే అది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: సిమెంట్ ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో మోత మోగిస్తున్న బస్తా రేటు.. ఇంకా పైకి చేరనుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సిమెంట్ ధర 6-13 శాతం పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ మధ్య బొగ్గు, పెట్ కోక్, ముడి చమురు దిగుమతులు భారమైపోయాయి. ఈ ప్రభావం సిమెంట్ ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి యుద్ధం కారణంగానే బొగ్గు, పెట్ కోక్ ధరలు గడిచిన ఆరు నెలల్లో 30-50 శాతం పెరిగాయి. క్రిసిల్ తాజా నివేదిక ప్రకారం గడిచిన ఏడాది కాలంలో జాతీయ స్థాయిలో ఒక్కో సిమెంట్ బస్తా ధర రూ.390కి పెరిగింది. పెరిగిన ఉత్పాదక వ్యయాన్ని వినియోగదారులపై సిమెంట్ కంపెనీలు వేస్తే ఈ నెలలో బస్తా రేటు మరో రూ.25-50 పెరగవచ్చని అంటున్నది. ఇంధనం, విద్యుత్తు, రవాణా చార్జీలు పెరగడంతో సిమెంట్ ధరలు పెరుగుతూపోతున్నాయని దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం చెప్తున్నది.
సిమెంట్ ధరలు ఇలాగే పెరిగితే నిర్మాణ రంగం భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టేనని క్రెడాయ్ హెచ్చరించింది. సిమెంట్తోపాటు స్టీల్ ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమని అభిప్రాయపడింది. ఇక ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రాజెక్టులు ఆగిపోవచ్చన్న ఆందోళనలు దాదాపు 40 శాతం రియల్టర్లలో కనిపిస్తున్నాయని క్రెడాయ్ తాజా సర్వే ఒకటి తెలియజేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి-మార్చిలో రియల్ ఎస్టేట్ రంగ సెంటిమెంట్ మునుపెన్నడూ లేనివిధంగా బలపడిందని నైట్ఫ్రాంక్-నరెడ్కో సర్వే ఒకటి వెల్లడించింది. వచ్చే ఆరు నెలల్లోనూ ఇదే రకమైన ఉత్సాహం ఉండొచ్చని చెప్పింది. నివాస, వాణిజ్య స్థిరాస్తులకు డిమాండే ఇందుకు కారణంగా పేర్కొన్నది.
సిమెంట్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా.. దాని డిమాండ్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) 7-8 శాతం ఎగిసి దాదాపు 382 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరవచ్చని బుధవారం ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 11 నెలల్లో సిమెంట్ ఉత్పత్తి 323 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21)తో చూస్తే 22 శాతం ఎక్కువ. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ రంగం పుంజుకోవడం, మౌలిక రంగ ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించడం సిమెంట్ వినియోగాన్ని పెంచుతున్నదని ఇక్రా అభిప్రాయపడింది.
సిమెంట్ తయారీలో బొగ్గు, పెట్ కోక్ కీలకం. వాటి ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. వీటి దిగుమతులూ భారమైపోయాయి. ఈ క్రమంలో ముడి చమురు ధరల సెగ కూడా ఇప్పుడు సిమెంట్ పరిశ్రమకు తగులుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం.. రవాణా, పంపిణీ వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో గత నెల బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 21 శాతం ఎగబాకి 115 డాలర్లకు చేరింది. మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో ధరలు 79 శాతం ఎగిశాయి. అంతర్జాతీయంగా పెట్ కోక్ ధర కూడా మార్చిలో 43 శాతం, 2021-22 మొత్తంగా 96 శాతం పెరిగింది. ముఖ్యంగా సముద్ర జలాలపై రవాణా ఖరీదెక్కడంతో టన్ను పెట్ కోక్ ధర ఏడాదిలో దాదాపు 130 డాలర్లు పెరిగింది. దేశీయంగా కూడా ధరలు 26 శాతం పెరిగాయి. ‘ఎప్పుడూ పెరిగే బొగ్గు, పెట్ కోక్ ధరలకుతోడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్ల సెగ కూడా సిమెంట్ పరిశ్రమను తాకుతున్నది. రవాణా, పంపిణీ భారమైపోయింది’అని కనోడియా సిమెంట్ ఎండీ విశాల్ కనోడియా అన్నారు.