సైదాబాద్, జనవరి 25: కొవిడ్-19 కట్టడికి సెంట్రల్ కౌన్సిల్ రిసెప్షన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఎఎస్) ఆధ్వర్యంలో తయారు చేసిన ‘సంశమనివటి’ (గుడూచి/గిలక్షయ్) ఔషధాన్ని మంగళవారం సంస్థ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు సంస్థ అందజేసింది. సైదాబాద్ రెవెన్యూ బోర్డు కాలనీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (సీసీఆర్ఎఎస్-మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్) ఇన్చార్జి అసిస్టెంట్ డాక్టర్ జీపీ ప్రసాద్ పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిప్ప తీగ కాండంతో తయారైన ఈ ఔషధం వ్యాధి నిరోధక శక్తిని పెంచి కొవిడ్-19ను నిరోధించడంలోనూ, ఎదుర్కొనడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని అన్నారు.
శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే స్వభావం కలిగిన ఔషధాన్ని నెల రోజులకు సరిపోయేలా ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఔషధాన్ని విడతల వారీగా ఫ్రంట్లైన్ వారియర్స్ పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ ఔషధం కావాల్సిన వారు కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ముందుగా నమోదు చేసుకున్న వారికి అందజేస్తామని, మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్ 94412 73178లో సంప్రదించాలన్నారు.