న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓ పిల్ విచారణ సమయంలో ఈసీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచిత హామీలపై రాజకీయ పార్టీలను నియంత్రించేందుకు చేసే ప్రయత్నం తమ అధికార పరిధిని దాటినట్లు అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉచిత హామీలు ప్రకటించే పార్టీలను రద్దు చేయాలని బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. రాష్ట్ర విధానాలను ఎన్నికల సంఘం నియంత్రించలేదని, గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేపట్టే నిర్ణయాలను రెగ్యులేట్ చేయలేమని ఈసీ తెలిపింది. చట్టంలో ఎటువంటి అధికారాలు లేకుండానే అలాంటి చర్యల్ని చేపట్టలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉచిత హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీల విధాన నిర్ణయమని ఈసీ పేర్కొన్నది.