హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను సమర్థంగా ఎదుర్కోవడానికి టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులోభాగంగా టీకా ప్రక్రియ చురుకుగా సాగటానికి తీసుకోవాల్సిన చర్యల కోసం క్యాబినెట్ సబ్కమిటీని నియమించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చైర్మన్గా.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఈ కమిటీ పనిచేస్తుంది.. సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒమిక్రాన్ పేరుతో కొత్త వేరియంట్ వస్తుందన్న ప్రచారంతోపాటు ఎలాంటి పరిస్ధితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ఎలా సంసిద్ధంగా ఉండాలి? రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ బెడ్స్ వంటి అంశాలపై సమీక్షించారు.
అన్ని జిల్లా ల్లో టీకా ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంత్రులంతా జిల్లాల్లో సమీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యశాఖాధికారులు నివేదిక అందించారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి అధికారులు క్యాబినెట్కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిపై నివేదిక సమర్పించారు. గత రెండేండ్లుగా కరోనా కట్టడికోసం జరిగిన పురోగతిపై చర్చ సందర్భంగా, వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు వివరించారు. రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో మందులు, టీకాలు సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదురోవడానికి వైద్యశాఖ సిద్ధంగా ఉండాలని క్యాబినెట్ ఆదేశించింది. అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని క్యాబినెట్ ఆదేశించింది.
అప్రమత్తంగా సర్కారు!
దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందటంపై రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. మనదేశంలో ఇప్పటివరకు ఆ వేరియంట్కు సంబంధించిన కేసు నమోదుకాకున్నా, సర్కారు ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో రెండో వేవ్ విజృంభించి తగ్గుముఖం పట్టాక, మూడో వేవ్ వస్తుందని పలు అధ్యయనాలు అంచనావేశాయి. అప్పుడే మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో పకడ్బందీ చర్యలు తీసుకొన్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 60,099 పడకలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలో 27,966 ఉండగా, ఇందులో 26 వేలకు పైగా ఆక్సిజన్ పడకలు ఉన్నాయి.
6 వేల ఐసీయూ పడకలు కూడా ఉన్నాయి. ప్రైవేటులో 16 వేల సాధారణ పడకలు, 14 వేల ఆక్సిజన్ పడకలు, 9 వేలకు పైగా ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. థర్డ్ వేవ్లో చిన్నారులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో గతంలోనే పిల్లల కోసం 33 జిల్లాల్లో 10 వేల పడకలను సర్కారు ఏర్పాటు చేసింది. పీడియాట్రిక్ బడ్జెట్ పేరుతో రూ.133 కోట్ల నిధులు విడుదల చేసి, వైద్య పరికరాలు, సర్జికల్స్, మందులను కొనుగోలు చేసింది. ఆక్సిజన్ కొరత ఉండకుండా రూ.103 కోట్లతో 132 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రైవేటులోనూ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు తప్పనిసరి చేయటంతో కొరతకు ఆస్కారమే లేదు.