పేటీఎం షేరు క్షీణతపై వివరణ కోరిన బీఎస్ఈ
ఫండమెంటల్స్ బాగున్నాయంటూ సంస్థ సమాధానం
న్యూఢిల్లీ, మార్చి 23: పేమెంట్ క్యూఆర్ కోడ్ ఆగ్రిగేటర్ పేటీఎం షేరు నిలువునా పతనమవుతున్న వైనంపై స్టాక్ ఎక్సేంజీలు అప్రమత్తమయ్యాయి. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేరు ఏరోజుకారోజు తగ్గుతూ వస్తున్నది. షేరు ఒడిదుడుకులపై సంస్థను బీఎస్ఈ వివరణ కోరింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా కంపెనీకి సంబంధించిన తాజా సమాచారాన్ని తక్షణమే తెలియచేయాలంటూ ఎక్సేంజ్ ఆదేశించింది. ఇందుకు స్పందనగా తమ బిజినెస్ ఫండమెంటల్స్ పటిష్ఠంగా ఉన్నాయని, సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీ షేరును ప్రభావితం చేసే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎక్సేంజీలకు పంపిస్తున్నట్టు పేటీఎం వివరణ ఇచ్చింది. ఈ వివరణతో సైతం షేరు పతనం ఆగలేదు. బుధవారం మరో 3.5 శాతం నష్టపోయిన 97 కమ్యూనికేషన్స్ షేరు రూ.524 వద్ద ముగిసింది.
4 నెలల్లో లక్ష కోట్ల సంపద నష్టం
నాలుగు నెలల క్రితం ఈ సంస్ధ జారీచేసిన ఐపీవో ధరలో ప్రస్తుతం షేరు విలువ 25 శాతమే ఉంది. రూ.2,150 ధరతో షేర్లను ఐపీవోలో విక్రయించగా, 2021 నవంబర్ 18న ఇది రూ.1,955 వద్ద లిస్టయ్యింది. పబ్లిక్ ఆఫర్ ధర వద్ద పేటీఎం విలువ రూ.1,39,432 కోట్లుకాగా, ఇప్పుడది రూ.35,282 కోట్లకు పడిపోయింది. దీంతో ఈ షేరులో ఇన్వెస్టర్లు లక్ష కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.