బర్మింగ్హామ్లో భారత్ దూకుడు కొనసాగుతున్నది. హైజంప్లో తేజస్విన్ శంకర్, లిఫ్టింగ్లో గుర్దీప్ సింగ్ కాంస్య కాంతులు విరజిమ్మితే.. బాక్సింగ్లో ఆరుగురు పతకాలు ఖాయం చేసుకోగా.. 200 మీటర్ల పరుగులో హిమదాస్.. హ్యామర్ త్రోలో మంజు బాలా ఫైనల్కు దూసుకెళ్లారు. తొలిసారి కామన్వెల్త్ బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయంతో సెమీస్లో అడుగుపెట్టగా.. సింగిల్స్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు.
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు.. చివరి లీగ్ మ్యాచ్లో వేల్స్ను చిత్తు చేయగా.. బ్యాడ్మింటన్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్కు చేరారు. 200 మీటర్ల పరుగులో హిమదాస్ ఫైనల్కు అర్హత సాధించగా.. బాక్సింగ్లో మన దేశానికి ఆరో పతకం ఖాయమైంది. స్కాష్, లాన్బౌల్స్, అథ్లెటిక్స్లో మనవాళ్లు దూకుడు కనబర్చారు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన హై జంప్ పోటీల్లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకంతో కొత్త చరిత్ర లిఖించాడు. కామన్వెల్త్ పురుషుల హై జంప్లో భారత్కు ఇదే అత్యత్తుమ ప్రదర్శన కావడం విశేషం. ఫైనల్లో శంకర్ 2.22 మీటర్ల ఎత్తు ఎగిరి రికార్డు సృష్టించాడు. హమీష్ కెర్ (న్యూజిలాండ్), బ్రాండన్ స్టార్క్ (ఆస్ట్రేలియా) వరుసగా స్వర్ణ, రజతాలు చేజిక్కించుకున్నారు. రెండు నెలల పాటు సాగిన నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ హై కోర్టు జోక్యం చేసుకోవడంతో బర్మింగ్హామ్ బెర్త్ దక్కించుకున్న శంకర్.. తన స్ఫూర్తిదాయక ప్రదర్శనతో కాంస్య కాంతులు విరజిమ్మాడు. మరో ఇద్దరు అథ్లెట్లు కూడా 2.22 మీటర్ల ప్రదర్శన నమోదు చేసి.. మూడో స్థానం కోసం పోటీపడ్డా.. శంకర్ తొలి ప్రయత్నంలోనే సునాయాసంగా ఈ ఫీట్ (2.22 మీ) నమోదు చేసుకోగా.. మిగిలిని ఇద్దరు అంతకన్నా ఎక్కువసార్లు ప్రయత్నించడంతో భారత అథ్లెట్కు కాంస్యం దక్కింది.
భారత స్టార్ స్ప్రింటర్, ధింగ్ ఎక్స్ప్రెస్ హిమదాస్ మహిళల 200 మీటర్ల ఫైనల్కు అర్హత సాధించింది. గురువారం హీట్స్లో హిమ 23.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి.. తుదిపోరుకు దూసుకెళ్లింది. ఫేవరేట్స్ అనుకున్న స్టార్ అథ్లెట్లను వెనక్కి నెడుతూ.. 22 ఏండ్ల హిమ చక్కటి టైమింగ్ నమోదు చేసింది. ఇక మహిళల హ్యామర్ త్రోలో మంజు బాలా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయింగ్ రౌండ్లో హ్యమర్ను 59.68 మీటర్ల దూరం విసిరిన మంజు 11వ స్థానంతో ఫైనల్ చేరింది. ఇదే విభాగంలో పోటీ పడ్డ సరిత (57.48 మీటర్లు) 13వ స్థానంతో నిరాశ పరిచింది. శనివారం జరుగనున్న తుదిపోరులో మంజు బరిలోకి దిగనుంది.
కెర్, స్టార్క్ను టీవీలో చూసి సంబురపడేవాడిని. అలాంటిది వారితో కలిసి పతకం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నా. దేశానికి పతకం మోసుకెళ్లడం చెప్పలేని అనుభూతి. ఇక్కడితో ఆగిపోవాలనుకోవడం లేదు. మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తా.
– తేజస్విన్ శంకర్