పేరుకు అది దూర విద్య. కానీ.. ఎన్నో లక్షల మందికి ఉన్నత విద్యను దగ్గర చేసింది. గ్రామీణ, పట్టణ, ధనిక, పేద అన్న తేడా లేకుండా అందరికీ అందుబాటులోకి విద్యను తీసుకువచ్చిన ఘనత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకే చెందుతుంది. ఎన్నో మైలురాళ్లను దాటుతూ వచ్చిన ఈ వర్సిటీ ఇప్పుడు 40 ఏండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నది. ఇప్పుడు రెగ్యులర్ విశ్వవిద్యాలయాలతో పోటీపడుతూ న్యాక్ గుర్తింపు వైపునకు అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో వీసీ ప్రొఫెసర్ సీతారామారావును ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. వర్సిటీ విద్యావిధానం, అందులో అమలు చేస్తున్న సంస్కరణలు వంటి విషయాలన్నీ ఆయన మాటల్లోనే…
యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఎన్నో విజయాలు తన ఖాతాలో వేసుకున్న బీఆర్ఏఓయూ దేశంలోనే తొలి ఓపెన్ వర్సిటీగా చరిత్ర కెక్కింది. తొలి ఏడాది 600 అడ్మిషన్లతో ప్రారంభమై.. ఇప్పుడు ఏటా లక్ష మందికి పైగా విద్యార్థులకు బోధన సాగిస్తున్నది. 2021-22 విద్యాసంవత్సరంలో ఏకంగా 1.23 లక్షల అడ్మిషన్లు ఇచ్చి కొత్త చరిత్ర లిఖించింది. టెక్నాలజీ సహాయంతో డిజిటల్ పాఠాలు, ఆన్స్క్రీన్ మూల్యాంకనం నిర్వహిస్తున్నాం. ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి తెచ్చాం. కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, పీవీ నరసింహారావు, ప్రొఫెసర్ జీ.రామిరెడ్డి వంటి తెలంగాణ వైతాళికులపై ప్రత్యేక ఉపన్యాసాలు నిర్వహిస్తున్నాం.
రెగ్యులర్ యూనివర్సిటీలతో పోటీ పడుతూ ఇప్పుడు న్యాక్ గుర్తింపు రేసులో ఉంది. 2022-23 విద్యాసంవత్సరం నాటికి న్యాక్ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత రెగ్యులర్ యూనివర్సిటీ మాదిరిగానే విద్యార్థుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తాం. ముఖ్యంగా సైన్స్ కోర్సులకు కావాల్సిన ల్యాబ్స్ నిర్మాణాలు కూడా చేపడుతున్నాం.
ఈ వర్సిటీలో పొందిన డిగ్రీలు దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా చెల్లుబాటు అవుతాయి. సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, టీచర్, పోలీస్ వంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా 2013 నుంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చాం. తొలుత ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టాం. ఆ తర్వాత ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చాం. ఈ పాఠాలను యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించే అవకాశం కల్పించాం.
లీగల్ అవేర్నెస్, కన్జ్సూమర్ అవేర్నెస్, హ్యూమన్ రైట్స్, ల్యాండ్ అండ్ రైట్స్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ల్యాండ్స్కేపింగ్ వంటి స్కిల్ అండ్ ఒకేషనల్లో కొత్తగా డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. అంతేకాదు.. ఏఐ, ఎంఎల్, రోబోటిక్స్, డాటాసైన్స్ వంటి కొత్త కోర్సులో డిప్లొమా సర్టిఫికెట్లు అందించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం.
యూజీసీ నిర్ణయం మేరకు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారికే ప్రవేశాలు కల్పిస్తున్నాం. ఓపెన్ స్కూల్ విధానం కూడా అందుబాటులో ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో సమర్థవంత పాలనకు శ్రీకారం చుట్టాం. అందరి భాగస్వామ్యంతో అనేక సంస్కరణలు తెచ్చాం. యూజీతో పాటు పీజీ కోర్సుల్లో సెమిస్టర్ పరీక్షలను ప్రారంభించాం.