Brahmanandam | తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన హాస్య బ్రహ్మా బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ భేటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రహ్మానందాన్ని ఆప్యాయంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి, శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రతిగా బ్రహ్మానందం తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి పెన్సిల్ ఆర్ట్ చిత్రాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. ఈ ప్రత్యేకమైన బహుమతి రాష్ట్రపతిని ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీ వెనుక ఉన్న అసలు కారణాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇద్దరూ కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్గా మారాయి. సినీ రంగంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ బ్రహ్మానందం ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఆయన కేవలం గొప్ప హాస్య నటుడే కాకుండా, అద్భుతమైన చిత్రకారుడిగా కూడా పేరుగాంచారు. ముఖ్యంగా పెన్సిల్ ఆర్ట్లో దేవుళ్ల చిత్రాలను అద్భుతంగా గీయడం ఆయన ప్రత్యేకత. ఖాళీ సమయాల్లో చిత్రలేఖనం చేయడం ఆయనకు ఎంతో ఇష్టం. తనను కలిసే ప్రముఖులకు తాను గీసిన చిత్రాలను బహుమతిగా అందించడం ఆయన ప్రత్యేకమైన అలవాటు. కృష్ణంరాజు నుంచి రామ్ చరణ్ వరకు అనేక ప్రముఖులకు ఆయన గీసిన చిత్రాలు అందించారు.
వయోభారంతో సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ, అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. తాజాగా విడుదలైన ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాలో ఆయన నటన మరోసారి ప్రశంసలు అందుకుంది. రాష్ట్రపతితో భేటీ అయిన ఈ సంఘటన బ్రహ్మానందం వ్యక్తిత్వానికి మరో గౌరవ ఘట్టంగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.బ్రహ్మానందం పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ‘ఆహనా పెళ్లంట’ సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, వెయ్యికి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియా యుగంలో మీమ్స్కు ప్రాణంగా మారిన ఆయన పాత్రలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.