హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి క్రికెటర్లు ఐపీఎల్( IPL )లో ఆడతారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. అయితే తమ టీమ్కు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ మాత్రం యూఏఈలో జరిగే ఐపీఎల్కు అందుబాటులో ఉంటారని సన్రైజర్స్ హైదరాబాద్ సోమవారం ప్రకటించింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో టీమ్ సీఈవో షణ్ముగం మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నదానిపై మేము మాట్లాడలేదు. కానీ వాళ్లు మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు అని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 31న తమ టీమ్ యూఏఈకి బయలుదేరుతోందని షణ్ముగం వెల్లడించారు. ప్రస్తుతం రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో ఉన్నారు. అయితే తన కుటుంబాన్ని ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎలా బయటపడేయాలన్నదానిపై రషీద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చెప్పాడు. కాబూల్ ఎయిర్స్పేస్ మూసేయడంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.