న్యూఢిల్లీ, నవంబర్ 17: రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్లో నల్లధనం తగ్గిందని హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ అనరాక్ పేర్కొంది. 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత ఈ రంగంలో నగదు రూపేణా జరిగే నల్లధనం లావాదేవీలు 75-80 శాతం మేర తగ్గాయని సంస్థ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని రియల్టీ డెవలపర్ల నుంచి సేకరించిన సమాచారం, బ్యాంకుల గృహ రుణ పంపిణీల డాటా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సమీక్ష, 1,500పైగా సేల్స్ ఏజెంట్లు తెలిపిన వివరాల్ని పొందుపర్చిచూస్తే హౌసింగ్ మార్కెట్లో బ్లాక్మనీ చెలామణీ తగ్గినట్లు తేలిందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు. తాము సేకరించిన ఈ సమాచారం కొత్త గృహాల కొనుగోళ్లకు సంబంధించింది మాత్రమేనని, రీసేల్ది కాదన్నారు. గతంలోలా నల్లధనాన్ని వదిలించుకునేందుకే ఇండ్లు కొనడం లేదని, స్వంత గృహాల్ని కోరుకునేవారు కొంటున్నారన్నారు. ఇప్పుడు కొనుగోలుదార్లలో చాలాశాతం వారి లావాదేవీలు పారదర్శకంగా ఉండాలనుకుంటున్నారని పురి తెలిపారు. హౌసింగ్ రంగంలో నగదు వినియోగం పూర్తిగా తొలగిపోలేదని, చిన్న పట్టణాల్లో జరుగుతున్న ప్రాపర్టీ లావాదేవీల్లో నల్లధనం ప్రవహిస్తున్నదన్నారు.